హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కీలక నేతలు ఒక్కో్క్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. మాజీమంత్రి, బీజేపీ నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి ఇవాళ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు పంపారు. పార్టీలో కొనసాగేందుకు మనసు అంగీకరించడం లేదని, మారిన రాజకీయాల దృష్ట్యా పార్టీలో కొనసాగలేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
కనీసం తనతో చర్చించకుండానే ఈటల రాజేందర్ను బీజేపీలో చేర్చుకొన్నారని ఆయన పార్టీ నాయకత్వంపై బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా గత వారం క్రితమే బీజేపీకి రాజీనామా చేశారు. సుదీర్ఘకాలం పాటు టీడీపీలో ఉన్న పెద్దిరెడ్డి చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన గతంలో ప్రాతినిథ్యం వహించాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి టీడీపీని వీడి బీజేపీలో చేరారు.