దేశంలోని చాలా రాష్ర్టాల్లో దళితుల పరిస్థితి ఇప్పటికీ దయనీయంగానే ఉంది. ఈ విషయంలో బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ దేశంలోనే ముందుంటుంది. అక్కడ ఎవరికి కోపం వచ్చినా ముందుగా బలయ్యేది దళితులే. వారు సంతోషంగా ఉండకూడదు. ఆనందం పంచుకోకూడదు. అగ్రవర్ణాల వారికి మించి ఎదగకూడదు. వారిముందు అణిగిమణిగి ఉండాలి. లేదంటే దాడులకు తెగబడతారు. దళితులపై దాడులు అక్కడ నిత్యకృత్యం.
మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు టార్చిలైటు వేసి వెతికినా కనిపించవు. స్వరాష్ట్రంలో దళితులు గౌరవంగా జీవిస్తున్నారు. ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం వారిని సొంతకాళ్లపై నిలబెట్టింది. బతుకులను బాగు చేసింది. ఆత్మగౌరవం పెంచింది. పదిమందికి ఉపాధి కల్పించే స్థాయిలో వారిని నిలబెట్టింది.
Dalitha Bandhu | కల్వకుర్తి/యాదాద్రి భువనగరి (నమస్తే తెలంగాణ) ఆగస్టు 19: దళితబంధు పథకం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ మండలం దశదిశను మార్చింది. పథకం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో ఇదొకటి. దళితబంధును ప్రారంభించి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ బృందం మండలంలో పర్యటించింది. పథకంతో లబ్ధిపొందిన వారితో ముచ్చటించింది. వారి జీవితాల్లో వచ్చిన మార్పులను పరిశీలించింది. మండలంలో 1,407 మంది లబ్ధిదారులు ఉన్నారు. పథకం ద్వారా వచ్చిన రూ.10 లక్షలతో ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు, డెయిరీ, పౌల్ట్రీఫాంలు, ఫర్టిలైజర్, ఎలక్ట్రికల్ షాప్స్, సిమెంట్, డిపార్ట్మెంటల్ స్టోర్, హార్డ్వేర్ ఇలా నచ్చిన రంగాలను ఎంచుకుని వ్యాపారంలో ముందుకు సాగుతున్నారు. అంతకుముందు వరకు కూలీలుగా జీవితాలు గడిపిన వీరంతా ఇప్పుడు ప్రభుత్వ సాయంతో స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. ఆత్మగౌరవంతో బతుకుతూ మరికొందరికి చేయూత అందిస్తున్నారు. మండలంలో ఏ లబ్ధిదారుడిని కదిలించినా రెండేండ్ల క్రితం వరకు అనుభవించిన కష్టాలను గుర్తుకు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు తామెంత సంతోషంగా ఉన్నామో చెబుతూ ఆనందాన్ని పంచుకుంటున్నారు.
చారకొండ మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో మొత్తం 1,407 మందిని దళితబంధు లబ్ధిదారులుగా అధికారులు గుర్తించారు. అగ్రహారం తండాలో 22 మంది, చారకొండలో 223 మంది, మర్రిపల్లిలో 43, రామచంద్రాపురంలో 37, శిరుసనగండ్లలో 133, తిమ్మాయిపల్లిలో 125, తుర్కలపల్లిలో 148, చంద్రాయన్పల్లిలో 110, ఎర్రవల్లిలో 64, గోకారంలో 129, జేపల్లిలో 73, జూపల్లిలో 235, శేరీ అప్పారెడ్డిపల్లిలో 65 మంది లబ్ధిదారులు ఉన్నారు. 1,407 యూనిట్లకుగానూ అందరూ వాటిని ఎంపిక చేసుకోవడంతో మండలంలో దళితబంధు నూటికి నూరు శాతం విజయవంతమైంది.
మాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. ముగ్గురం అన్నదమ్ములం. పొలంపై ఆధారపడి బతుకలేని పరిస్థితి. పనులు లేనప్పుడు హైదరాబాద్ వెళ్లి లారీ డ్రైవర్గా పనిచేసేటోడ్ని. భార్యాపిల్లలను పోషించుకునేందుకు చాలా ఇబ్బందులు పడ్డా. పది రూపాయలు ఖర్చు పెట్టాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వచ్చేది.
అలాంటి పరిస్థితులు అనుభవిస్తున్న సమయంలో ప్రభుత్వం దళితబంధు పథకం ప్రవేశపెట్టింది. మేము ముగ్గురం అన్నదమ్ములం దళితబంధు పథకానికి ఎంపికయ్యాం. మా అన్న, తమ్ముడు డెయిరీ, కిరాణం ఎంచుకుంటే.. నేను టీ స్టాల్ను ఎంచుకున్నాను. శ్రీశైలం చౌరస్తాలో టీ స్టాల్ను ఏర్పాటు చేసుకున్నా. నా వద్ద నలుగురు ఉపాధి పొందుతున్నారు. ఖర్చులన్నీ పోను రోజుకు రూ.2 నుంచి, రూ.3 వేల వరకు మిగులుతున్నాయి. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను.
– కావలి మురళి, టీ స్టాల్ యజమాని, తుర్కలపల్లి గ్రామం, చారకొండ మండలం, నాగర్కర్నూల్ జిల్లా
నేను ఇంటర్ వరకు చదువుకున్నా. ఒక చేయి లేకపోవడంతో బయట ఏ పనీ చేయలేకపోయేవాడిని. దళితబంధు పథకంతో రూ.10 లక్షలు వచ్చాయి. కరెంటు సామాన్లు, హార్డ్వేర్, రంగుల దుకాణం ఏర్పాటు చేసుకున్నాను.
ఇప్పుడు నాకు ఎలా బతకాలన్న చింత లేదు. వ్యాపారం బాగా సాగుతున్నది. వ్యాపారంతో నేను కుటుంబానికి అండగా ఉంటున్నా. దళితబంధు లేకుంటే ఇతరులపై ఆధారపడి జీవించాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. గౌరవంగా జీవిస్తున్నా. దళితబంధు పథకం లేకుంటే మాలాంటోళ్ల పరిస్థితి ఏంటో తలచుకోవడానికే భయంగా ఉంది.
– జీ అయ్యప్ప, సాయిరాం హార్డ్వేర్ దుకాణం, చారకొండ, నాగర్కర్నూల్ జిల్లా
నాకు మా గ్రామం వద్ద చిన్న పంక్చర్ దుకాణం ఉండేది. గిరాకీ లేనప్పుడు డ్రైవింగ్ చేసేందుకు వెళ్లేటోడ్ని. ఉన్న రెండెకరాల పొలంలో ఇద్దరం అన్నదమ్ములం పనిచేస్తేనే పొట్ట నిండేది. ఎంత పనిచేసినా తిండికి, బట్టకే సరిపోయేది. పిల్లల అవసరాలకు డబ్బులు సరిపడకపోయేటివి.
చారకొండ మండలం దళితబంధు పథకానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడంతో మా బతుకులు మారుతాయని అనుకున్నాం. ఊహించినట్టే జరిగింది. మా అన్నదమ్ములిద్దరికీ దళితబంధు పథకం వర్తించింది. నా తమ్ముడు టెంట్హౌస్ పెట్టుకుంటే, నేను చారకొండలో టైర్ల దుకాణం పెట్టుకున్నా. నాకు పంక్చర్లు వేసే పని రావడంతో వ్యాపారం బాగా పెరిగింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది. వ్యాపారం బాగా సాగుతున్నది. ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాను.
– జంతుక యాదయ్య, టైర్ల దుకాణం యజమాని, రామచంద్రాపురం, చారకొండ మండలం, నాగర్కర్నూల్ జిల్లా
దళితబంధులో మాకు రూ.10 లక్షల సాయం వచ్చినందుకు సంతోషపడుతున్నం. ఆ డబ్బుతో ఊర్ల కారంపొడి మిషన్ పెట్టుకున్న. మిరపకాయలు తెచ్చి మిషన్ల పొడి చేస్తున్న. నా పేరు, నా మనవరాల పేరు మీద కారం అమ్ముతున్నం. కారం పొట్లాలు మా పేర్ల మీదనే ఉన్నయి.
భువనగిరి, తురపల్లి, చక్రీపురం, జగదేవ్పూర్, కుషాయిగూడకు బండి మీద పోయి కారం ప్యాకెట్లు వేసొస్తున్నం. ఎంటనే పైసలు వసూలు చేసుకుంటున్నం. నేను, మా ఇంట్ల అందరం పనిచేస్కుంట బతుకుతున్నం. మంచిగా నాకు నెల పేరు మీద ఖర్చులు పోంగా రూ.30వేల నుంచి రూ.35 వేలు మిగుల్తున్నయి. అంతకు ముందు కూలి దొరికేది కాదు. కూలి ఒక అయ్య ఇచ్చేది.. ఓ అయ్య ఇయ్యకపోయేది. అప్పుడు కూలి చేసినా పైసలు మిగలకపోతుండే. అన్నం తినే రోజులు లేకుండా బతికినం. అలా పూట గడుపుకొన్నం అప్పుడు. ఎకడైనా మీటింగ్కు పోతే వాసాలమర్రి అంటే తెలవకపోతుండె. ఇప్పుడైతే అందరికీ తెలిసింది. మాకు చాలా సంతోషం.
– చెన్నూరు చంద్రమ్మ, వాసాలమర్రి, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా
చారకొండ మండలకేంద్రంలో చిన్న ఫర్టిలైజర్ షాపు ఉండే. దళితబంధు డబ్బులతో దానిని ఆగ్రోరైతు సేవా కేంద్రంగా మార్చుకున్నా.
నా తండ్రికి కూడా దళితబంధు పథకం వర్తించడంతో ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. నా వ్యాపారం బాగా సాగుతున్నది. వ్యాపారాన్ని విస్తరించడానికి దళితబంధు పథకం ఎంతగానో ఉపకరించింది. ఈ పథకం లేకపోయి ఉంటే అదే చిన్న దుకాణంతో బతుకు సాగించేటోడిని. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తీసుకొచ్చిన దళితబంధు పథకంతో మా జీవితాలు చాలా మారిపోయాయి. ఇప్పుడు మేం హ్యాపీగా ఉన్నాం.
– ఎర్ర రామకృష్ణ, ఆగ్రోసేవా కేంద్రం, చంద్రాయన్పల్లి, చారకొండ మండలం, నాగర్కర్నూల్ జిల్లా
డిగ్రీ పూర్తి చేశాక బతుకుదెరువు కోసం ఎలక్ట్రీషియన్గా పనిచేసేటోడిని. ఆ పని చేసుకుంటూనే గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాను. మేము ఇద్దరం అన్నదమ్ములం.
దళితబంధు పథకానికి ఇద్దరం లబ్ధిదారులుగా ఎంపికయ్యాం. మా అన్న కారు కొనుగోలు చేస్తే, నేను సూపర్మార్కెట్ ఏర్పాటు చేసుకున్నా. సూపర్ మార్కెట్ నిర్వహణకు మరొకరు అవసరం కనుక ఒకరికి పని కల్పిస్తున్నా. వ్యాపారం బాగా సాగుతున్నది. చట్టుపక్కల గ్రామాలు వారు ఎక్కువగా వస్తుండటంతో గిరాకీ పెరిగింది. ఈ దుకాణాన్ని మరింతగా విస్తరిస్తా. నేను ఇలా సూపర్ మార్కెట్ ఏర్పాటు చేస్తానని కలలో కూడా అనుకోలే. మాలాంటి దళిత కుటుంబాలకు చేయూతనివ్వడంతో వ్యాపారస్థులుగా నిలదొక్కుకుంటున్నాం.
– గోరటి అఖిలేశ్, వైఎన్ఎం సూపర్మార్కెట్, చారకొండ, నాగర్కర్నూల్ జిల్లా
మునుపు నా కొడుకు కంపెనీలో పనిచేసేది. నెలకు రూ.10వేల నుంచి రూ.12వేలు మాత్రమే జీతం వస్తుండే. ఇల్లు గడువుడే కష్టమైతుండే. ఏ పూటకు ఆ పూట అన్నట్లు ఉంటుండే.
ఇప్పుడు మా వాసాలమర్రిలో దళితబంధు ఇచ్చిన్రు. మొత్తం రూ.10లక్షల సాయం చేసిన్రు. వాటితో మూడు యూనిట్లు చేసినం. మాకు భూమి ఉందిగానీ అది ఎప్పుడూ పొలం చేయలే. పాడువడ్డ భూమి. దళితబంధు పైసలతో బోరు వేసుకున్నం. మంచిగా నీళ్లు పడ్డయి. పొలం అచ్చు కట్టుకున్నం. ఏడాదిన్నరసంది మూడు పంటలు ఏసినం. తిండి గింజలు, ఖర్చులు పోగా.. పంటకు రూ.30వేల నుంచి 40వేలు మిగుల్తున్నయి. మూడు బర్లు తెచ్చుకున్నం. బర్ల పేరు మీద నెలకు రూ.10 వేలు మిగుల్తున్నయి. అట్లనే నా కొడుక్కు ఒక ఆటో తెచ్చుకున్నం. ఆటో మీద రూ.20 వేలు పక్కనేస్తున్నం. మొత్తంగా నెలకు 30నుంచి 40వేలు చేతికొస్తున్నయి. అంతకుముందు యాడ కూలికి పోవాలో యాడ దొరుకుతదో అని ఎదురు చూసేటోళ్లం.ఇప్పుడా బాధ తప్పింది.
– బొల్లారం పోచమ్మ, వాసాలమర్రి, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా
దళితబంధు పథకంలో వచ్చిన రూ.10 లక్షలతో డోజర్ కొన్న. రోజురోజు మంచిగా డెవలప్ అవుతున్నం. అప్పుడు పూటకెళ్లుడు కష్టమయ్యేది. మిత్తీలకు తెచ్చి అప్పుల పాలైనం.
ఇప్పుడు డోజర్తో మంచి గిరాకీ వస్తున్నది. నేను, నా కొడుకు డోజర్ను నడుపుతున్నం. నెలకు 70వేల దాకా వస్తున్నయి. ఖర్చులు పోంగా 50వేల దాకా మిగుల్తున్నయి. అప్పులన్నీ కట్టినం. ఇప్పుడు బ్యాంక్లో 5లక్షల దాకా జమ చేసినం. ఇప్పుడు సంతోషం అనిపిస్తది. దళితబంధు దేవుడే మాకు ఇచ్చిండు అనుకుంటం. తెలంగాణ రాక మునుపు మమ్మల్ని ఎవరూ పట్టించుకోలే. కాపాడటానికి ఎవరూ రాలే. మా గోడు పట్టించుకున్న నాథుడే లేకపాయె. ఇప్పుడు మా కష్టాలన్నీ తీరినై.
– గ్యార నర్సింహులు, వాసాలమర్రి, తుర్కపల్లి మండలం, యాదాద్రి జిల్లా