కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ ముక్తకంఠంతో తీర్మానం చేసింది. కేంద్రాన్ని పాలిస్తున్న బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రఘునందన్రావు.. సరిగ్గా ఆ సమయానికి అసెంబ్లీ నుంచి గాయబ్ అయ్యారు.
కూకట్పల్లి ప్రాంతంలో బుధవారం నాలుగో విడత పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు దళిత సంఘాల నేతలు వెళ్లారు. వాళ్లను పట్టించుకోకుండా బండి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దళితనేతలు పోలీసు వలయాన్ని ఛేదించుకొని ముందుకు వెళ్లేసరికి ఇక వారిని కలవక తప్పలేదు. ఇచ్చిన వినతిపత్రాన్ని తీసుకొని.. మొక్కుబడిగా మూడు ముక్కలు మాట్లాడి.. వేగంగా వెళ్లిపోయారు.
ట్విట్టర్లో మాత్రం పార్లమెంట్కు అంబేద్కర్ పేరుపెట్టాలంటూ గద్దర్ ఇచ్చిన ఓ వినతి పత్రాన్ని తమ పార్టీ పెద్దలకు పంపించానంటూ ఓ పోస్ట్ పెట్టి మమ అనిపించారు.
పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టడంపై బీజేపీ పలాయనవాదాన్ని సమస్త తెలంగాణ సమాజం నిరసించింది. వైఖరి చెప్పకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్న బీజేపీ నేతలను అడుగడుగునా ప్రశ్నించింది. పార్లమెంట్కు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాష్ట్రవ్యాప్తంగా క్షీరాభిషేకాలు చేస్తూనే.. మరోవైపు బీజేపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తూ పార్టీ వైఖరిని చెప్పాలన్న డిమాండ్ వెల్లువెత్తింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నడూ అంబేద్కర్ ఆశయాలను అమలు చేయలేదు. కొత్త పార్లమెంట్కు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ కోరడం అభినందనీయం. ఈ విషయమై అసెంబ్లీలో తీర్మానం చేసే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే హాజరు కాకుండా దానిని వ్యతిరేకించడం ద్వారా వారికి అంబేద్కర్ ఆశయాలపై ఉన్న విలువ ఏమిటో తెలుస్తున్నది. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు. – మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం ప్రత్యేకాధికారి
హైదరాబాద్/ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ)/ కేపీహెచ్బీ కాలనీ: ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్పై రాష్ట్ర బీజేపీ వైఖరి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు బీజేపీ నేతలను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అడ్డుకొని నిలదీస్తున్నారు. దళితసంఘాల నేతలు బుధవారం కూకట్పల్లిలో బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకొన్నారు. పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టే విషయమై బీజేపీ తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కేపీహెచ్బీ కాలనీ నుంచి మూసాపేట వైపు పాదయాత్రగా వస్తున్న బండి సంజయ్ని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు దాదాపు మూడు వేల మంది దళిత ఐక్యవేదిక నేతలు రోడ్డుపై ఎదురుచూశారు. కానీ, పోలీసులు వారిని సంజయ్ని కలిసేందుకు వెళ్లనివ్వలేదు. దీంతో దళితనేతలు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు. బండి సంజయ్ కూడా అటు పక్కకు చూడకుండా నేరుగా ముందుకు సాగడంతో ఆందోళన చెందిన దళిత నేతలు పోలీసు వలయాన్ని ఛేదించుకొని సంజయ్ వద్దకు దూసుకొనిపోయారు. ఎట్టకేలకు బండిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ‘తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానించారు. ఈ తీర్మానంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు మద్దతు తెలిపాయి. బీజేపీ తీర్మానంలో పాల్గొనలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైన తమరు ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలి’ అని వినతిపత్రంలో పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని బహిరంగంగా చెప్పాలని దళితులు బండిని డిమాండ్చేశారు. దళితులతో మాట్లాడేందుకు ఇష్టపడని సంజయ్.. ముక్తసరిగా నాలుగు మాటలు మాట్లాడి జారుకొన్నారు.
మా మాట విననైనా లేదు
బండి సంజయ్ తీరును నిరసిస్తూ దళితులు ఓవైపు.. దళితులను అడ్డుకొనేందుకు బీజేపీ నేతలు మరోవైపు హడావుడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి నేతృత్వంలో పోలీసులు ఇరువర్గాలను శాంతపరిచారు. దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ, పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని శాంతియుతంగా వినతిపత్రం అందించేందుకు వస్తే కనీసం పట్టించుకోకుండా ముందుకు సాగడం తమను అవమానించడమేనని మండిపడ్డారు. దళితుల న్యాయబద్ధమైన కోరికను కనీసం వినే పరిస్థితిలో కూడా లేరని వాపోయారు. ఓట్ల కోసమే బీజేపీ నేతలు దళితుల జపం చేస్తారని సమస్యలు చెప్తామంటే పట్టించుకోరని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో దళితులెవరూ బీజేపీకి మద్దతివ్వద్దని పిలుపునిచ్చారు.
బండి సంజయ్ కలవనందుకు నిరసనగా కూకట్ పల్లిలో రోడ్డుపై బైఠాయించిన దళిత నేతలు
మొక్కుబడిగా ట్వీట్
అంబేద్కర్ పేరు పెట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానంచేసిన సంగతి తెలిసిందే. మరోవైపు దళితులు ప్రశ్నిస్తుండటంతో బండి సంజయ్ బుధవారం మొక్కుబడిగా ఒక ట్వీట్ చేశారు. ప్రజా గాయకుడు గద్దర్ ఇటీవల బండి సంజయ్ని కలిసి పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టేలా కేంద్ర ప్రభుత్వానికి సూచించాలంటూ ఒక వినతిపత్రం అందజేశారు. ‘గద్దర్ అందించిన వినతిపత్రాన్ని పరిశీలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను’ అని బండి సంజయ్ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు బండిపై మండిపడుతున్నారు. ‘ఎవరో ఇచ్చిన వినతి పత్రాన్ని పంపించడం కాదు.. బీజేపీ వైఖరి ఏమిటో చెప్పండి’ అని నిలదీస్తున్నారు. పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టేందుకు బీజేపీ సుముఖంగా ఉన్నదా? లేదా? అని అడుగుతున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఏమైనా తీర్మానం చేసిందా? లేదా? నీ లెటర్హెడ్పై లేఖరాసి పంపించారా? ఒక వేళ అలా చేస్తే ఆ పత్రాన్ని చూపించు అని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పార్టీ అధిష్ఠానానికి అధికారికంగా ప్రతిపాదనలు పంపించారా? అని నిలదీస్తున్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి ఈ అంశంపై ఇంతవరకు ఎందుకు నోరు విప్పలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
రఘునందన్ దిష్టిబొమ్మ దహనం
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల బీజేపీ నేతలను ప్రజలు ఇవే ప్రశ్నలతో నిలదీస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానంచేస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు ఎందుకు సభ నుంచి వెళ్లిపోయారని దుబ్బాకలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు నిరసనగా బుధవారం ఆయన దిష్టిబొమ్మలను దహనంచేశారు. ఈ అంశంపై బీజేపీకి చెందిన గల్లీ నుంచి ఢిల్లీ నేతల వరకు ఎక్కడికక్కడ నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే తెలంగాణలో అడుగుపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు
రాజ్యాంగ నిర్మాత అంబేదర్ పేరు పార్లమెంటుకు పెట్టాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు దళిత ఐక్యవేదిక అధ్యక్ష, కార్యదర్శులు బోడ నర్సింగ్రావు, యడ్ల సత్యనారాయణ, చంద్రశేఖర్, బండి సుధ, రాము ధన్యవాదాలు తెలిపారు. గతంలో బాలానగర్ మెట్రో స్టేషన్కు అంబేదర్ పేరు పెట్టాలని కోర గా.. 24 గంటల్లోనే స్పందించి బాలానగర్ మెట్రో స్టేషన్కు డాక్టర్ బీఆర్ అంబేదర్ స్టేషన్గా నామకరణం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దకుతుందని దళిత సంఘాల నేతలు అన్నారు.
బీజేపీ నేతలను తిరగనివ్వం
పార్లమెంట్ కొత్త భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం గొప్ప విషయం. తెలంగాణ సమాజం అంతా ఆహ్వానించింది. తెలంగాణ బీజేపీ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. రాజ్యాంగాన్ని రాసిన మహనీయుడి పేరు పెట్టడానికి కూడా బీజేపీ సంకోచిస్తున్నది. బీజేపీ కుటిల రాజకీయాలకు ఇది నిదర్శనం. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకొంటాం. తెలంగాణ బీజేపీ నేతలెవ్వరికీ రాష్ట్రంలో తిరిగే అర్హత లేదు.
– వేముల మారయ్య, టీఆర్ఎస్కేవీ