(నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్): దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై దళితులు కన్నెర్రజేశారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దళితులకు ఉచితంగా డబ్బులు ఎలా ఇస్తారని మాట్లాడటం రాధాకృష్ణ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. దళితులు వ్యాపార, వాణిజ్య రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు ప్రవేశపెడితే ఆయనకేం బాధ అని, దళితులపై ఇంత అక్కసా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ‘దళితబంధు ఉచితంగా వస్తే నీకేం బాధ.. మేం ఎదగటం ఇష్టం లేదా?’ అని రాధాకృష్ణపై మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాక సతీశ్ మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర సాధనలో చురుకైన పాత్ర పోషించిన నమస్తే తెలంగాణ పత్రికను కించపరిచేలా మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని విమర్శిస్తే ఊరుకోబోమని, ఆంధ్రజ్యోతి ఎండీ వెంటనే క్షమాపణ చెప్పాలని దళితబంధు లబ్ధిదారులు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అందించిన ఆర్థిక అండతో మొబైల్ టిఫిన్ సెంటర్ పెట్టుకొని దర్జాగా బతుకుతున్నానని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురానికి చెంది న వాడపల్లి సోమయ్య తెలిపారు. డెయిరీ ఫాం, డ్రోన్ వ్యవసాయ యూనిట్, ఐజాక్ మిషన్ తదితర యూనిట్లు పెట్టుకొని ఆర్థికం గా ఎదుగుతున్నామని పలువురు దళితులు పేర్కొన్నారు. దళితబంధును అవమానిస్తే దళితులను అవమానించినట్టేనని, రాధాకృష్ణ నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూ ల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అటు.. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో రాధాకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ఆందోళనలో ఏఎంసీ డైరెక్టర్ కన్నం సాగర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
దళితుల వ్యతిరేకిగా వ్యవహరిస్తూ దళిత బంధుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వెంటనే దళిత వర్గానికి క్షమాపణ చెప్పాలి. దళితబంధు దళితులకు ఒరగబెట్టిందేమీ లేదన్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఆయనపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. గతంలోనూ దళితులపై వ్యతిరేకంగా రాతలు రాస్తే దళితులు భావోద్వేగానికి గురై ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేసింది రాధాకృష్ణకు గుర్తు లేదా? క్షమాపణ చెప్పకుంటే మళ్లీ దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది. – వంగపల్లి శ్రీనివాస్మాదిగ, టీఎస్ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
చావు డప్పు కొడతాం
బిడ్డా.. నీ పద్ధతి మార్చుకోకపోతే నీ ఆఫీసు ముందు, మీ ఇంటి ముందు చావు డప్పు కొట్టి మరీ నిరసన తెలియజేస్తాం. దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళితబంధును, తెలంగాణ ప్రభుత్వ పథకాలను ఉచితాలని ప్రకటన చేసిన ఓ పత్రిక ఎండీ తన ప్రవర్తన మార్చుకోవాలి. లేదంటే ఆయన ఇంటి వద్దకు వెళ్లి నేనే స్వయంగా చావు డప్పు కొడతా. మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై చౌకబారు ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెప్తాం. – బండ శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్