మహబూబ్నగర్, జనవరి 25 : స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని, అధికారంలోకి వచ్చేందుకు వారి ఓట్లను మాత్రమే వినియోగించుకొన్నారని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. సామాజికంగా అత్యంత వెనుకబడిన దళితులను ఆదుకొనేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని స్పష్టంచేశారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపే ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కోరారు. మంగళవారం మహబూబ్నగర్ జెడ్పీ సమావేశ మందిరంలో దళితబంధుపై మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్షించారు. ఎస్సీలు సమాజానికి దూరంగా ఉన్నారని, దళితబంధు ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం గొప్పదని కొనియాడారు. మొదట ఎస్సీలకు ఆ తర్వాత దశలవారీగా ఎస్టీ, బీసీ, అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం ఇదే తరహా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుందని చెప్పారు. దళితబంధు అమలులో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఇతర పరిశ్రమలతో పాటు ఇతర రంగాల్లో డిమాండ్ ఉన్న యూనిట్లను గుర్తించి లబ్ధిదారులకు లాభం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాలలో యూనిట్లను గుర్తించి బుధవారం లోగా నివేదికలు సమర్పించాలని సూచించారు.