CM KCR | ధర్మపురి : కొప్పుల ఈశ్వర్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే హుజూరాబాద్ తరహాలో ఒకేసారి నియోజకవర్గం మొత్తానికి దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు ప్రకటించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దళితబంధు తీసుకురావాలని ఎవరూ నన్ను అడుగలేదు. దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడి పెట్టాను. ఈ సభతో ఈశ్వర్ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది.. గెలిచిపోయిండని తెలిసిపోయింది. నేను మీ అందరికీ ఒక్కటే హామీ ఇస్తున్నా. కొప్పుల ఈశ్వర్ 70-80వేల ఓట్ల మెజారిటీతో గెలవాలి. ధర్మపురి నియోజకవర్గం మొత్తానికి హుజూరాబాద్లో మాదిరిగా ఒకేసారి దళితబంధు పథకాన్ని మంజూరు చేయిస్తా. ప్రతి ఇంటికి కూడా దళితబంధు పథకం వస్తుంది’ అని వెల్లడించారు.
‘దళితబంధు ఎందుకు తీసుకువచ్చాం. తిన్నది అరగకనా? రైతుబంధుతో ఎట్లయితే రైతులను ఆదుకుంటున్నమో.. దళితబిడ్డలు, సమాజం దగా చేయబడ్డది. తరతరాల నుంచి దోపిడీకి గురైంది. అణచివేయిబడ్డది. ఆ సమాజం అలా ఉండడం మనందరికీ సిగ్గుచేటు. వాళ్లు కూడా సాటి మనుషులే. వారిని ఎట్టి పరిస్థితుల్లో పైకి తేవాలని.. సమాజం బాగుపడాలని స్వయంగా ఆలోచించి తీసుకువచ్చిన పథకమే దళితబంధు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా దళితబంధు గురించి ఆలోచన చేయాలి. దళితులను ఓటుబ్యాంకు వాడుకున్నారు తప్ప.. ఎన్నడూ చేసిన పాపానపోలేదు. సమాజంలో ప్రతి వర్గానికి పైకి తీసుకురావాలని.. చేతనైంతగా, ఉన్నంతలో అమలు చేస్తున్నది. దఫాదఫాలుగా అయినా ధర్మంగా చేయాలని రాష్ట్రల ఖజానాను ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నాం. సంపదను పెంచుతున్నాం. పేదలకు పంచుతున్నాం. సమాజం పైకి వస్తున్నది’ అన్నారు.
‘ఏదైనా రాష్ట్రం పైకి వచ్చిందా? లేదా అనడానికి ఓ గీటురాయి, కొలమానం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చూసే కొలమానం ఏంటంటే.. ఆ దేశమైతే ఆ దేశ తలసరి ఆదాయం ఎంత? చూస్తరు. దేశంలో ఏ రాష్ట్రం తలసరి ఆదాయం ఎంత అని చూస్తారు. నేను గర్వంగా చెబుతున్నా.. తెలంగాణ వచ్చిన రోజు మన స్థానం పదిహేనో పదహారో స్థానంలో ఉండే. గతంలో లక్షలోపు తలసారి ఆదాయం ఉండే.. ఈ రోజు 3.18లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నెంబర్వన్గా ఉన్నాం. తాగునీటి సరఫరా, కరెంటు, విద్యుత్ తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్గా ఉన్నది. పది సంవత్సరాల చిన్న వయసే ఉన్నా.. అనేక రంగాల్లో మంచి మార్పులు తెచ్చి రాష్ట్రాన్ని బాగు చేసి ముందుకుపోతున్నాం’ అన్నారు.
‘కులం, మతం అని చూడకుండా యావన్మంది మంది ప్రజలు మనబిడ్డలే కాబట్టి చేసుకుంటూ పోతున్నాం. ధర్మపురి ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు మంజూరు చేసుకున్నాం. పనులు జరుగుతున్నయ్.. ఇంకా జరగాల్సి ఉంటే.. మరింత డబ్బు మంజూరు చేసుకొని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా మార్చుకుందాం. మీ అందరిని కోరేది ఒకటే. కొప్పుల ఈశ్వర్ సౌమ్యుడు. కార్మికుడిగా పని చేసి పైకి వచ్చిన వ్యక్తి. ఎవరినీ ఒకమాట కూడా గట్టిగా మాట్లాడని వ్యక్తి. ఈశ్వర్లాంటి వ్యక్తి గెలిస్తే ధర్మపురి చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది. కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండమైన మెజారిటీతో ఈశ్వర్ను గెలిపించాలి’ అని కోరారు.