Telangana Decade Celebrations | హైదరాబాద్ : ఉద్యోగాలు లేవు. ఉత్పత్తి యంత్రాలూ సొంతమైనవి కావు. సాగుభూమి సంగతి సరేసరి. అత్యధిక శాతం మందికి రెక్కల కష్టమే జీవనాధారం. అభివృద్ధిలో చివరి స్థానం. అలాంటి అట్టడుగు స్థానంలో నిలిచిన దళితులను అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేదెలా? సిరిమంతులుగా మార్చేదెలా?.. ఇత్యాది ప్రశ్నలన్నింటికీ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా సీఎం కేసీఆర్ చూపిన పరిష్కారమే ‘దళితబంధు’ పథకం. దళితుల సముద్ధరణే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఆ పథకం లక్ష్యం దిశగా పరుగులు తీస్తున్నది. వెలివాడ జీవితాల్లో వెలుగులు నింపుతూ నిర్విఘ్నంగా ముందుకుసాగుతున్నది. తొలుత హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 18,021 మందికి .10 లక్షల చొప్పున అందజేసిన ప్రభుత్వం.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 38,323 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. హుజూరాబాద్లో పూర్తిస్థాయిలో అమలు చేయగా, మిగిలిన 118 నియోజకవర్గాల్లో 1,100 మంది చొప్పున దళితబంధు పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అందజేయాలని నిర్ణయించింది. అందుకోసం బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించింది.
సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం
ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలదే ప్రధాన పాత్ర. దళితబంధు పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా పరిశ్రమలు విస్తృతంగా ఏర్పాటవుతున్నాయి. దీంతో లబ్ధిదారులతోపాటు, మరికొంత మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటివరకు దినసరి కూలీలుగా జీవితాన్ని వెళ్లదీసిన దళితులే పారిశ్రామికవేత్తలుగా మారి మరికొందరికి ఉపాధి కల్పిస్తున్న దృశ్యాలు సాక్షాత్కరిస్తున్నాయి.
లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ
దళితబంధు లబ్ధిదారులకు ఆయా రంగాలపై అవగాహన కల్పిస్తున్నారు. అవసరాన్ని బట్టి వారిలో నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వమే ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నది. హుజురాబాద్ నియోజకవర్గంలో మినీ డెయిరీ యూనిట్లను ఎంచుకున్న 1,503 మంది లబ్ధిదారుల్లో 801 మందికి పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ ఇప్పించి, సర్టిఫికెట్లు అందజేసింది.
దళితబంధుతో మహిళా సాధికారత
మహిళా సాధికారతకు సైతం దళితబంధు ఊతమిస్తున్నది. ఔత్సాహిక మహిళలను వ్యాపార రంగం వైపు మళ్లించి వారికి అవసరమైన సహకారాలను అందించాలన్న లక్ష్యంతో వీహబ్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నాలుగున్నర ఏండ్లలో వేలమంది గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దింది. హుజురాబాద్ నియోజకవర్గంలోనే 343 మంది మహిళలతో యూనిట్లను ఏర్పాటు చేయించింది.
జారీచేసిన వారు: స్పెషల్ కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ