చౌటుప్పల్ రూరల్, ఫిబ్రవరి 16: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద గురువారం ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం గ్రామానికి చెందిన మహిళలు దండు మల్కాపురం పరిధి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులోని శ్వేత తెలుగు ఫుడ్స్ కంపెనీలో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. పరిశ్రమలో పనిచేయడానికి గురువారం ఏడుగురు మహిళా కూలీలు ఆటోలో బయల్దేరారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులోకి వెళ్తున్న క్రమంలో ఎదురుగా వేగంగా వచ్చిన అదే కంపెనీకి చెందిన బస్సు ఆటోను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటోలోని ఏడుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అంబులెన్స్లో హైదరాబాద్లోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. అప్పటికే ముగ్గురు మృతి చెందారు. చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. మృతి చెందినవారిలో దేవులమ్మ నాగారానికి చెందిన డాకోజు నాగలక్ష్మి (30), సిలివేరు ధనమ్మ (35), పిట్టంపల్లి శిరీష (28), వరకాంతం అనసూయ(62) ఉన్నారు. ఆటో డ్రైవర్ కొండ వెంకటేశంతోపాటు కూలీలు అఖిల, యామిని, కావ్య దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు జరుపుతున్నారు. మృతులకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్థులు, మృతుల బంధువులు గ్రీన్ ఇండస్ట్రియల్ పరిశ్రమ ఎదుట ఆందోళనకు దిగారు.