Saleshwaram | నాగర్కర్నూల్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని దట్టమైన లోతట్టు ప్రాంతంలో కొలువైన సలేశ్వరం లింగమయ్య స్వామి దర్శన భాగ్యం ఇకనుంచి నిరంతరం కలుగనున్నది. ఏడాదిలో ఎనిమిది నెలల పాటు సఫారీ టూర్లో లింగమయ్య దర్శనానికి అటవీశాఖ నిర్ణయించింది. ఈ నెలాఖరులో ఈ దర్శనం అమలులోకి రానున్నది. ఉగాది తర్వాత వచ్చే పౌర్ణమి సందర్భంగా ఏడాదిలో కేవలం మూడు రోజులే ఈ క్షేత్ర దర్శనం ఉంటుంది. దక్షిణాది అమర్నాథ్ యాత్రగా ఈ లింగమయ్య దర్శనం ప్రసిద్ధిగాంచింది.
తెలంగాణతో పాటుగా ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి సైతం లక్షలాది భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తారు. ఈ నెల 5 నుంచి 7 వరకు జరిగిన యాత్ర భక్తుల రద్దీతో కిటకిటలాడింది. కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. రద్దీ పెరిగి ఊపిరాడక ఇద్దరు భక్తులు సైతం మృతి చెందారు. లక్షల మంది భక్తులను నియంత్రించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులను జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, అటవీ శాఖ అధికారి రోహిత్ ప్రభుత్వానికి వివరించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో సఫారీ టూర్లో భాగంగా దర్శనం చేయించాలని నిర్ణయించారు. నిరంతర దర్శన వల్ల స్థానిక చెంచులకు ఉపాధి కల్పించటమేగాక వారికి, జంతువులకు నష్టం తలెత్తకుండా అటవీశాఖ పలు చర్యలు తీసుకొంటున్నది.
సలేశ్వర లింగమయ్య భక్తుల సౌకర్యార్థం సఫారీ టూర్ ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే వారం, పది రోజుల్లో ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ను ప్రారంభిస్తాం. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం నడుస్తున్న సఫారీ టూర్లో భాగంగా లింగమయ్య క్షేత్ర పర్యటనను అనుసంధానిస్తున్నాం.
– రోహిత్, జిల్లా అటవీ శాఖాధికారి