కళింగపట్నం వద్ద తీరాన్ని దాటిన గులాబ్ తుఫాన్ తీవ్రత తగ్గి బలహీనపడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్కు 65 కిలోమీటర్లు, తెలంగాణలోని భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నదని పేర్కొన్నది. 24 గంటల్లో తుఫాన్ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ స్పష్టంచేసింది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతూ అరేబియా సముద్రంలోకి ప్రవేశించే అవకాశమున్నదని అంచనావేసింది. సెప్టెంబర్ 30 నాటికి మళ్లీ బలపడే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. వాయుగుండం ప్రభావం తో ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షం కురిసే సూచనలు ఉన్నాయి. కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ, తెలంగాణల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ లలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు పేర్కొన్నది. ఉత్తర కోస్తా- ఒడి శా తీరప్రాంతాల్లో సముద్రం ఇంకా అలజడిగానే ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్ ప్రభావంతో 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వివరించింది. ఖమ్మం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.