Cyber Crime | హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): గృహిణులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. సెంటిమెంట్ డైలాగులతో ఫేక్ వీడియోలు రూపొందిస్తూ వలలో వేసుకొని, అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ భారీ సైబర్ రాకెట్ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు ఛేదించారు. కృష్ణవేణి మోసపోయిన విధానాన్ని పరిశీలించిన పోలీసులు విస్తృతంగా పరిశోధించారు. ఈ పరిశోధనలో అన్ని రాష్ర్టాలోనూ ‘లైలారావు’ బాధితులు ఉన్నట్టు తేలింది. సోషల్ మీడియాను ప్రచార ఆయుధంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. లైలా సూపర్, లైలా-యువర్ ఇన్వెస్ట్మెంట్ గైడ్, లైలారావు బెస్ట్, బిగ్ ఇన్కమ్స్ పేరిట చానళ్లు, గ్రూపులు, పేజీలు నిర్వహిస్తున్నట్టు తెలుసుకున్నారు.
‘నా పేరు లైలా రావు. నేనొక ఇన్వెస్టర్ని. నా కొడుకు, భర్తతో సంతోషంగా ఉన్నా. బాగా సంపాదించా. వంటింట్లోనే కుంగిపోతున్న మహిళలకు పెట్టుబడి పెట్టి ఆర్థికంగా ఆదుకోవాలనుకుంటున్నా. నటి స్మృతిఖన్నా నా రిలేటివ్. ఇటీవలే రతన్టాటా గ్రూప్తో ఒప్పందం చేసుకున్నా. రూ.5,999 పెట్టుబడితో 3 గంటల్లోనే రూ.లక్ష లాభం ఇప్పిస్తా. నమ్మకం లేకపోతే సద్గురు జగ్గీవాసుదేవ్ వీడియో చూడండి’ అంటూ సోషల్ మీడియా గ్రూపుల్లో ఓ వీడియో బాగా వైరల్ అయింది. ఇది నిజమేనని నమ్మి వాళ్లు ఇచ్చిన నంబర్కు హైదరాబాద్కు చెందిన కృష్ణవేణి (పేరు మార్చాం) కాల్ చేసింది. ఆ మాయలాడి మాటలను అమాయకంగా నమ్మి అడ్డంగా మోసపోయింది కృష్ణవేణి. పిల్లల ఫీజుల కోసం దాచిన రూ.32 వేలు పోగొట్టుకున్నది.
గత జూలై 31న కృష్ణవేణితో రూ.9 వేల పెట్టుబడి పెట్టించిన సైబర్ చీటర్లు.. రెండ్రోజుల పాటు ఆమె కాల్ చేసినా, మెసేజ్ చేసినా స్పందించలేదు. మూడోరోజు వాళ్లే కాల్ చేసి, రూ.9 వేల పెట్టుబడికి రూ.1,46,000 గెలుచుకున్నట్టు తెలిపారు. ఆ డబ్బును తీసుకోవాలంటే 15 శాతం కమీషన్ చెల్లించాలని షరతు విధించారు. దీంతో ఆశపడిన కృష్ణవేణి రూ.23 వేలు చెల్లించింది. మళ్లీ రెండ్రోజుల పాటు ఫోన్లకు స్పందించకపోవటంతో ఆలోచనలో పడింది. మళ్లీ వాళ్లే కాల్ చేసి, మొత్తం రూ.2 లక్షలు గెలుచుకున్నారని, 10 శాతం కమీషన్ చెల్లించాలని అనటంతో అనుమానం వచ్చిన కృష్ణవేణి పోలీసులను ఆశ్రయించింది. ఈ లింకులపై ఆరా తీయగా ఈ తరహా మోసాలు దేశవ్యాప్తంగా అన్ని సైబర్ స్టేషన్లలో నమోదైనట్టు గుర్తించారు. వీరి సంఖ్య వేలల్లో ఉన్నట్టు సమాచారం. నగదు రూ.లక్షలోపే గృహిణుల దగ్గరి నుంచి కాజేయటం గమనార్హం. తక్కువ మొత్తమే కోల్పోవటంతో ఫిర్యాదు చేసేందుకు, ఇంట్లో చెప్పుకొనేందుకు గృహిణులు భయపడుతున్నారని పోలీసులు వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు కాజేసిన నగదును ఢిల్లీ, అస్సాం సహా హైదరాబాద్లో పటాన్చెరులోని పలు బ్యాంకులకు మళ్లించారని వివరించారు. వాటిని క్రిప్టోగా మార్చి వ్యాలెట్లకు బదిలీ చేసుకున్నారని పేర్కొన్నారు.
‘గృహిణులకు పెట్టుబడి పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఫిర్యాదులు నమోదయ్యాయి. మోసగాళ్లు వివిధ రాష్ట్రాల నుంచి ఏకకాలంలో కార్యకలాపాలు సాగిస్తున్నారు. అప్రమత్తతే ఆయుధం’ అని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు హెచ్చరించారు.