Prajapalana | హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలన ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి 1,25,84,383 దర ఖాస్తులు అందాయి. వీటిలో అభయహస్తం కింద 1,05,91,636 దరఖాస్తులు రాగా, రేషన్కార్డు, ఇతర అంశాలకు సంబంధించి 19,92747 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు అంతాబాగానే ఉన్నా అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. వీటిన్నింటినీ ఈ నెల 17లోగా డాటా ఎంట్రీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే, ఇది సాధ్యమేనా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీజీజీ అధికారులు అప్లికేషన్ రూపకల్పనలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో డాటా ఎంట్రీలో సమస్యలు వెంటాడుతున్నాయి.
సర్వర్ సమస్యతో అప్లికేషన్ పదేపదే లాగ్ అవుతోందని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఆపరేటర్ రోజుకు 60-75 మించి దరఖాస్తులు చేయలేకపోతున్నాడు. దీనికితోడు ఆధార్కార్డు నంబర్ను 12 డిజిట్లకు పరిమితం చేయకుండా ఎన్ని నంబర్లు ఇచ్చినా తీసుకుంటున్నది. దీనివల్ల ఒక్క నంబర్ తక్కువైనా, ఎక్కువైనా లబ్ధిదారుడు నష్టపోయే ప్రమాదం ఉండడంతో జాగ్రత్తగా ఎంట్రీ చేయాల్సి వస్తున్నది. దీనికితోడు ఎడిట్ ఆప్షన్ కూడా లేకపోవడం మ రింత సమస్యగా మారిందని ఆపరేట్లరు చెప్తున్నారు. దీనికితోడు పండుగ సెలవులు కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తు తం ఐదు గ్యారెంటీలకు మాత్రమే డాటా ఎంట్రీ జరుగుతున్నది. రేషన్కార్డుల కోసం వచ్చిన 20 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు.
సీఎం రేవంత్రెడ్డి సోమవారం ప్రారంభించనున్న ప్రజాపాలన వెబ్సైట్ అచ్చం ప్రజలకు అందించిన దరఖాస్తు ఫారంలానే ఉంది. ఒక్కో గ్రామం/వార్డు, మండలం, జిల్లాల వారీగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఏయే గ్యారెంటీ కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంతమందికి ఎన్ని గ్యారెంటీలు అమలవుతున్నాయి? అన్న విషయం తెలుసుకునేందుకు డ్యాష్బోర్డు అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఎవరైనా తమకు పథకం అమలు కావడం లేదని ఫిర్యాదు చేస్తే సులభంగా తెలుసుకునే వీలుంది.
ప్రజాపాలన దరఖాస్తు మాటున సైబర్ ముప్పు కూడా పొంచి ఉందని, దరఖాస్తుదారులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మీరిచ్చిన దరఖాస్తు అర్హత సాధించిందని, కాబట్టి పేరు, రసీదు వివరాలు, ఫోన్ నంబర్, బ్యాంక్ వివరాలు చెప్పమంటూ కాల్స్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. తాము పంపే లింక్పై క్లిక్చేసి నిర్ధారించుకోవాలని, వచ్చే ఓటీపీని చెప్పాలంటూ వచ్చే కాల్స్ను నమ్మవద్దని సూచించారు. ఆరు గ్యారెంటీల్లో ఎన్నింటికి అర్హత సాధించారనే విషయం అధికారులే చెప్తారని, ఎవరికీ వివరాలు చెప్పవద్దని సూచించారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని, https://cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.