హైదరాబాద్/ సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని వక్తలు పేర్కొన్నారు. ఆడబిడ్డల సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే టాప్లో ఉన్నదని చెప్పారు. కేసీఆర్ పాలనలో సంబురంగా ఆడబిడ్డ బతుకుతున్నదని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్యలక్ష్మి పథకం.. ఇలా చెప్పుకుంటూపోతే అనేక పథకాలు, కార్యక్రమాలు మహిళల కోసం అమలు చేస్తున్నది ఒక్క కేసీఆర్ సర్కారు మాత్రమే అన్నారు. సీఎం కేసీఆర్ది తల్లిదండ్రుల మనసు అని తెలిపారు. దేశంలో ఎకడా లేనివిధంగా రూ.260 కోట్లు ఖర్చుపెట్టి న్యూట్రిషన్ కిట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ 50శాతం కల్పించారని గుర్తు చేశారు. తెలంగాణలో మాత శిశు మరణాల రేటు 92 నుంచి 47కు తగ్గిందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ‘మహిళా సంక్షేమ దినోత్సవ’ సంబురాలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆయా జిల్లాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో స్థానిక మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, హోంమంత్రి మహమూద్ అలీ, పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మిరెడ్డి, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్, పలువురు మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. ఇంటర్, పాలిసెట్తో పాటు వివిధ రంగాల్లో ప్రతిభకనబరిచిన విద్యార్థులకు, ఉత్తమ ప్రతిభ చూపిన మహిళా ఉద్యోగులకు మంత్రులు బహుమతులు అందజేశారు.
తెలంగాణ పోలీస్శాఖ దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కితాబిచ్చారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో మంగళవారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో మహిళా భద్రత, సైబర్ క్రైమ్స్పై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు మహిళలతోపాటు కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. దేశంలోనే తొలిసారిగా మహిళల కోసం ఏర్పాటుచేసిన సైబర్ క్రైమ్స్ హెల్ప్లైన్ నంబర్ 8712662662ను డీజీపీ అంజనీకుమార్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ నెంబర్ను మహిళలు సేవ్ చేసు కోవాలని మంత్రి సూచించారు. ఈ సదస్సులో సినీ నటులు ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.