హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇవాళ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాకు నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. జితేందర్ రెడ్డి డ్రైవర్తో పాటు ఆయన పీఏను కూడా పోలీసులు విచారించనున్నారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డి పాత్రపై కూడా విచారణ చేపట్టనున్నారు. మంత్రి హత్య కుట్ర కేసులో నిందితులకు జితేందర్ రెడ్డి పీఏ, డ్రైవర్ ఆశ్రయం ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన ఐదుగురు నిందితులను చర్లపల్లి జైలుకు సైబరాబాద్ పోలీసులు తరలించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్యకు రూ.15 కోట్ల సుపారీ అందిందని చెప్పిన పోలీసులు.. హత్యకు కుట్రపన్నిన 8 మందిని బుధవారం అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. ‘మహబూబ్నగర్కు చెందిన ఫారూక్, హైదర్అలీ ఫిబ్రవరి 25న హైదరాబాద్లోని సుచిత్ర వద్ద ఓ లాడ్జిలో ఉన్నారు. 27న టీ తాగడానికి బయటికి రాగా, వీరిద్దరిని హతమార్చేందుకు నాగరాజు, విశ్వనాథ్, యాదయ్య మారణాయుధాలతో వెంబడించారు. తప్పించుకొన్న హైదర్అలీ, ఫారూక్.. పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఫిబ్రవరి 26న ఫారూక్, హైదర్అలీ కోసం మిగతా లాడ్జిల్లో నాగరాజు, విశ్వనాథ్, యాదయ్య వెతుకుతుండగా వాళ్లను అరెస్టు చేశాం. 27న కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు పంపాం. ఆ దర్యాప్తులో మాకు ఓ హత్యకు సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చింది.
దీంతో నాగరాజును విచారించగా అతడు, మహబూబ్నగర్కు చెందిన రాఘవేంద్రరాజు, మరికొందరితో కలిసి ఓ ప్రముఖ వ్యక్తిని హతమార్చేందుకు కుట్ర పన్నుతున్నట్టు తెలిసింది. కొన్ని ఆధారాలు సేకరించగా రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, మధుసూదన్రాజు ఢిల్లీలో ఉన్నట్టు తెలిసింది. ఆ తర్వాత సాంకేతిక పరిజ్ఞానంతో వీరి లొకేషన్ చూడగా ఢిల్లీలోని సౌత్ ఎవెన్యూ మాజీ ఎంపీ జితేందర్రెడ్డి ఇంట్లోని సర్వెంట్ క్వార్టర్స్లో ఉన్నట్టు స్పష్టమైంది. రాఘవేంద్రరాజు, మధుసూదన్రాజు, మున్నూరు రవిని అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకొచ్చాం. వారిని విచారించగా ఈ ముగ్గురితో పాటు అమరేందర్రాజు కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు రూ.15 కోట్ల సుపారీ డీల్ మాట్లాడుకొన్నట్టు తెలిసింది. నాగరాజు అరెస్టు విషయం తెలియగానే.. రాఘవేంద్రరాజు, మధుసుదన్రాజు, అమరేందర్రాజు, మున్నూరు రవి మహబూబ్నగర్ నుంచి వైజాగ్, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లారు.
అక్కడ మాజీ ఎంపీ జితేందర్రెడ్డి పీఏ రాజు, డ్రైవర్ తాపా సహాయంతో సర్వెంట్ క్వార్టర్స్లో ఉన్నారు. వారిని అరెస్టు చేసి తీసుకొచ్చామని, అరెస్టయిన రాఘవేంద్రరాజు, మున్నూరు రవి నుంచి 9ఎంఎం తుపాకి, రెండు బుల్లెట్లు, 6 రౌండ్లతో కూడిన రివాల్వర్ను స్వాధీనం చేసుకొన్నామని సీపీ వివరించారు. సాంకేతికంగా, శాస్త్రీయంగా ప్రాథమిక ఆధారాలు సేకరించగా మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర తేటతెల్లమైందని తెలిపారు. ఈ కుట్రతో సంబంధం ఉన్న 8 మంది.. రాఘవేంద్రరాజు, మధుసూదన్రాజు, మున్నూర్ రవి, అమరేందర్ రాజు, నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్, తాపాను అరెస్టు చేశామని తెలిపారు. నిందితులను అరెస్టు చేసే సమయంలో ఢిల్లీ పోలీసులకు పూర్తి సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు.