హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న డాటా చోరీ కేసులో అసలు నిందితులను పట్టుకొనేందుకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం 10 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. 17 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం చోరీ చేసిన ముఠాను యూపీలోని నోయిడాలో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో డాటా లీకేజీలు, క్రయ విక్రయాల విషయాలో నిందితులకు కలిగిన ఆర్థిక ప్రయోజనం, డాటాను ఎంత మందికి విక్రయించారు? విదేశాలకు ఈ డాటా పోయిందా? ఈ ముఠాకు సహకరించింది ఎవరు? దేశ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఈ ముఠా ఎప్పటి నుంచి ఈ డాటా చోరీ చేస్తున్నది? అనే కోణంలో ఈ బృందం దర్యాప్తు చేయనున్నది.
సైబరాబాద్ పోలీసులు ఛేదించిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయా రాష్ర్టాల పోలీసులు అడిగి తెలుసుకొన్నారు. దీంతో ఈ కేసును సీరియస్గా తీసుకొన్న సైబరాబాద్ పోలీసులు, ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నారు.