హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రోజురోజుకు పేట్రేగిపోతున్న సైబర్ నేరగాళ్లు పోలీసులకు నేరుగా సవాళ్లు విసురుతున్నారు. తాజాగా హైదరాబాద్ పరిధిలో దర్యాప్తు అధికారితో ఓ సైబర్ నేరగాడు ఫోన్లో ఆసక్తికర సంభాషణ జరిపాడు. ఓ ఫిర్యాదు దారుడు సైబర్ నేరగాళ్లచేతిలో మోసపోయానని ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్కు వచ్చాడు. అదే సమయంలో బాధితుడికి సైబర్ మోసగాడు ఫోన్ చేసి ‘నీ డబ్బు వాపసు వస్తుంది. కొన్ని చార్జీల కింద ఫీజు చెల్లిస్తే చాలు. మొత్తం డబ్బు తిరిగి వస్తుంది’ అని చెప్పాడు. బాధితుడు పోలీసు అధికారితో మాట్లాడాలని ఫోన్ ఇవ్వటంతో సైబర్ నేరగాడు ఎలాంటి భయం, బెరుకు లేకుండా పోలీసు ఆఫీసర్తో మాట్లాడాడు.
‘మాకు పెద్ద వ్యవస్థ ఉన్నది. నేను మాట్లాడిన తర్వాత సిమ్ కార్డును తీసేస్తాను. మరో సిమ్ వాడుతాను. ఎలా పట్టుకొంటారు? మాకు సిమ్ కార్డులు సరఫరా చేసే ముఠా ఉన్నది. బ్యాంకు ఖాతాలు ఇచ్చే ముఠాలు ఉన్నాయి. అమాయకుల ఫోన్ నంబర్లను అమ్మేవారు ఉన్నారు. కేసుల నుంచి బయటపడేసేందుకు బడా బాబుల మద్దతు ఉన్నది. మా ఆదాయం రోజుకు రూ.20 వేలు. నేకొక్కడినే కాదు మా ఊరిలో ఏడో తరగతి పాసైన ప్రతిఒక్కరు ఇప్పుడు ఇదే దందాలో ఉన్నారు. ఎంతమందిని పట్టుకుంటారు? మమ్మల్ని మీరు పట్టుకోగలరా? అని సవాలు చేశాడు.
ఈ సైబర్ నేరగాళ్లు అత్యధికంగా జార్ఖండ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ర్టాల్లోని మారుమూల ప్రాంతాల నుంచి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. వీరిని పట్టుకోవటం కూడా అంతతేలిక కాదని, ప్రజలే వీరి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల మాటలకు, మెసేజ్లు, మెయిల్స్, వాట్సాప్ ఇతర వాటికి స్పందించవద్దని కోరుతున్నారు. బాధితులు 24 గంటలలోపు డయల్ 100 లేదా 155260కు ఫోన్ చేయాలని తెలిపారు.