మేడిగడ్డ బరాజ్కు మరింత నష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆది నుంచీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు జస్టిస్ పినాకి చంద్రఘోష్ కూడా అదే తరహాలో నీటి పారుదల శాఖను ఆదేశించడం గమనార్హం.
Medigadda Barrage | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బరాజ్ బ్లాక్ను అలా వదిలేస్తే ఎలా? అని జ్యుడీషియల్ విచారణ కమిటీ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అభిప్రాయపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. జూన్ నెలలోనే ప్రాణహితకు ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బరాజ్లో తదుపరి నష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టంచేశారు. ఈ మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి లేఖ రాసి, తక్షణం చేపట్టాల్సిన మరమ్మతులు, చర్యలపై మధ్యంతర నివేదిక తెప్పించుకోవాలని సూచించారు. అదేవిధంగా అన్నారం, సుందిళ్ల్ల బరాజ్లకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై కూడా నివేదిక తెప్పించుకోవాలని సూచించినట్టు తెలిసింది. మేడిగడ్డ బరాజ్ ఏడో బ్లాక్లో మూడు పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్డీఎస్ఏ కమిటీ పలు దఫాలుగా క్షేత్రస్థాయి పరిశీలన చేసింది.
ఈ కమిటీ నివేదిక సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల గడువు ఇచ్చింది. అయితే, జూన్లోనే వరదలు వచ్చే అవకాశం ఉండటంతో బరాజ్కు మరింత నష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నిపుణులు గతంలోనే సూచించారు. నీటిపారుదల శాఖ ఇంజినీర్లు సైతం తక్షణ చర్యలపై ఎన్డీఎస్ఏకు నివేదిక కూడా ఇచ్చారు. కానీ, ఎన్డీఎస్ఏ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందలేదు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ‘ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చే వరకు వేచిచూద్దాం’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. దీంతో మధ్యంతర నివేదిక కోసం ఎన్డీఎస్ఏపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం లేదనే విమర్శలొస్తున్నాయి. రెండు, మూడురోజుల్లో ఎన్డీఎస్ఏ నివేదిక రాబోతున్నదని ఇటీవల నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించినా అలాంటిదేమీ రాలేదు. ఈ నేపథ్యంలో ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికను వెంటనే తెప్పించుకోవాలని ప్రభుత్వానికి జస్టిస్ పినాకి చంద్రఘోష్ సూచించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. బరాజ్కు మరింత నష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆది నుంచీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అదే తరహాలో తాజాగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కూడా నీటి పారుదల శాఖను ఆదేశించడం విశేషం.
కాళేశ్వరంపై జ్యుడీషియల్ విచారణ చేపట్టిన ఘోష్.. శనివారం కోల్కతాకు వెళ్లేముందు అధికారులతో సమావేశమయ్యారు. మే నెలాఖరున లేదా జూన్లో గోదావరికి వరదలు రానున్న నేపథ్యంలో బరాజ్లు మరింత దెబ్బతినకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. దీనికోసం అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ నిపుణుల కమిటీ నివేదికను తెప్పించుకోవడానికి వీలుగా కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్కు లేఖ రాయాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను ఆదేశించారు. ఆ నివేదికను వెనువెంటనే తెప్పించుకొని, దాని ఆధారంగా బరాజ్ల రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విచారణలో ఎన్సీఎస్ఏ నివేదిక కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
విచారణ కోసం ఈ నెల 24న హైదరాబాద్ వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్, మూడురోజులపాటు హైదరాబాద్లో మకాం వేసిన అనంతరం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కోల్కతాకు తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు, కాళేశ్వరం విచారణపై పత్రికల్లో బహిరంగ ప్రకటనను విడుదల చేసి, విచారణకు అవసరమైన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మే 8న కోల్కతా నుంచి హైదరాబాద్ రానున్న ఆయన.. అదేరోజు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లీను సందర్శించనున్నారు. తదనంతరం హైదరాబాద్కు చేరుకొని.. కాగ్ నివేదికతోపాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదిక, ఎన్టీఎస్ఏ నివేదికలపై అధ్యయనం చేసే అవకాశాలున్నాయి.