CM Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): రూ.2 లక్షల రైతు రుణమాఫీపై తమకొక ప్రణాళిక ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఆదాయాన్ని పెంచుకోవడం, పన్నులు రాబట్టడం, దుబారా ఖర్చులు తగ్గించుకోవడం, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారా ఆగస్టు 15లోపు రైతుల రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టంచేశారు. శనివారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి సాక్షిగా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసితీరుతానని మరోసారి, మరో దేవతపై ఒట్టు పెట్టారు. మొత్తం దోపిడీ చేయకుండా ఉంటే, రుణమాఫీ చేయగలుగుతామనే నమ్మకం తనకు ఉన్నదని పేర్కొన్నారు. భూములు అమ్మకుండా రుణమాఫీ చేయాలన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై రేవంత్రెడ్డి స్పందిస్తూ.. ‘వాళ్లు రుణమాఫీ చేయొద్దని కోరుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో రుణమాఫీపై సీఎం రేవంత్రెడ్డి మాటలతో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రుణమాఫీకి రూ.30-40 వేల కోట్లు అవసరమని సీఎం రేవంత్రెడ్డి పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో అంత భారీ మొత్తం ఆదాయం ఎప్పుడు పెరుగుతుంది? రుణమాఫీ ఎలా అవుతుంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రుణమాఫీ కోసం రేవంత్రెడ్డి నిర్దేశించిన ఆగస్టు 15 గడువుకు ఇంకా నాలుగు నెలలు మాత్రమే ఉన్నది. ఈ స్వల్ప కాలంలో రూ.40 వేల కోట్ల ఆదాయం ఎలా సమకూర్చుకుంటారనేది ప్రశ్న. రుణమాఫీపై రేవంత్రెడ్డి పూటకో మాట మాట్లాడటంపై విమర్శలొస్తున్నాయి. ఎన్నికలకు ముందు డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. మరోసారి ఒక న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో నెల రోజుల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని, ప్రత్యేకంగా కార్పొరేషన్ను ఏర్పాటుచేసి, రైతుల రుణాలను దానికి బదలాయించుకుంటామని తెలిపారు. నిన్న మొన్నటి వరకు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని చెప్తూ వచ్చారు. తాజాగా ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. ఇలా పూటకో మాట చెప్తున్న నేపథ్యంలో అసలు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.