హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): డబ్బులు ఎవరికీ ఊరికేరావు.. ఉత్తి పుణ్యానానికి ఎవరూ గిఫ్టులు ఇవ్వరు.. ఇలా వచ్చే మెసేజ్లు, వాట్సప్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజల షాపింగ్ పెరగడంతో గిఫ్టులు గెలుచుకున్నారంటూ దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ‘షాపింగ్ చేసినప్పుడు ఇచ్చిన గిఫ్ట్ కూపన్లలో మీరే విజేత.. మీరు కేవలం మేం అడిగిన వివరాలు పంపడమే’ అంటూ మొదట ఊదరగొడుతారు.. ఎవరైనా అమాయకులు వారి మాటలు నమ్మితే అప్పుడు మోసానికి తెరతీస్తున్నారు. ఇంకొందరు సైబర్ నేరగాళ్లు ‘మీకు అత్యంత ఆప్తులు సర్ప్రైజ్ గిఫ్ట్ పంపారు. అది మీకు రావాలంటే ముందుగా కొంత జీఎస్టీ, ఇతర పన్నులు చెల్లించాలని’ బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో అత్యాశే అసలు సమస్య అని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి మోసాల్లో చిక్కుకోకుండా కనీస జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇవి గుర్తుంచుకోండి..
మీకు గిఫ్ట్ వచ్చిందని ఎవరైనా వాట్సప్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా లింకులు పంపితే వాటిని క్లిక్ చేయవద్దు.
బహుమతులు వచ్చాయంటూ ఎవరైనా ఫోన్చేసి, మీ వివరాలు అడిగితే ఇవ్వకూడదు. ముఖ్యంగా మీ బ్యాంకు ఖాతా, ఆధార్కార్డు నంబర్, పాన్కార్డు నంబర్ వంటివి ఇవ్వకూడదు.
కారు, బైక్, ఫ్రిడ్జ్ వంటి ఖరీదైన బహుమతులు వచ్చాయంటూ ఎవరైనా ఫోన్చేస్తే అవి సైబర్ నేరగాళ్లపనిగానే గుర్తించాలి.
మనం ఎలాంటి షాపింగ్ చేయకుండానే బహుమతులు ఎలా వస్తాయి? అన్న కనీస విషయాన్ని గుర్తుంచుకోవాలి.
మన బ్యాంకు ఖాతాల్లో ఎలాగూ డబ్బులు లేవు కాబట్టి.. అవతలి వాళ్లకు వివరాలు చెప్పినంత మాత్రాన ఏం సమస్య వస్తుందిలే..అని అనుకోవద్దు. మీ వివరాలు వాడుకునే ప్రమాదం ఉన్నది.