హైదరాబాద్: సైబర్ చీటర్స్ జనాలను దోచుకునేందుకు ఎప్పటికప్పుడు తమ రూటు మార్చుకుంటున్నారు. సందర్భాలను బట్టి కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ మధ్య ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన ఈ-చలాన్ల పేరిట కొత్త రకం మోసానికి తెరతీశారు. ఇ-చలాన్ల పేరుతో వాహనదారులకు వ్యక్తిగత మెసేజ్లు పంపి బురిడీ కొట్టిస్తున్నారు. దాంతో ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు ఇ-చలాన్ల పేరుతో వ్యక్తిగత సందేశాలు పంపుతున్నారని, అందులోనే పేమెంట్ లింకును కూడా ఉంచుతున్నారని, ఎవరైనా నిజమే అనుకుని ఆ లింకుపై క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతా వివరాలను హ్యాక్ చేసి డబ్బులు మాయం చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
సాధారణంగా ఇ-చలాన్ల పేరిట వచ్చే మెసేజ్లలో వాహనం నంబర్, ఇంజిన్, ఛాసిస్ నంబర్ వంటి వివరాలు ఉంటాయని, సైబర్ చీటర్స్ పంపే వాటిలో ఆ వివరాలు ఏవీ ఉండవని పోలీసులు చెబుతున్నారు. అదేవిధంగా ఇలాంటి మెసేజ్లు మొబైల్ ఫోన్ల నుంచి రావనే విషయాన్ని కూడా జనం గుర్తుంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇలాంటి అనుమానాస్పద మెసేజ్లు వచ్చినప్పుడు అధికారిక వెబ్సైట్కు వెళ్లి చెక్ చేసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ఇ-చలాన్లకు సంబంధించిన వెబ్సైట్ను పోలిన వెబ్సైట్లతో నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఒకవేళ మోసపోతే వెంటనే సైబర్ క్రైమ్ విభాగానికి, బ్యాంకుకు సమాచారం ఇవ్వాలని, ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.