Jangaon | జనగామ, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : ‘ఇందుమూలంగా జనగామ పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా, ఇంటి పన్ను వడ్డీపై 90శాతం రిబేట్ (రాయితీ) ఇచ్చినప్పటికీ కొంతమంది ఇంటి పన్ను చెల్లింపుదారులు వినియోగించుకోలేదు. దీంతో మున్సిపాలిటీ అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నది. మున్సిపాలిటీకి చెల్లించాల్సిన ఇంటి పన్నుల చెల్లింపులో అలసత్వం వహించినందున మీ ఇంటికి విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని తెలియజేస్తున్నాము’.. ఇది జనగామ పురపాలక సంఘం కమిషనర్ విడుదల చేసిన పత్రికా ప్రకటన సారాంశం. పన్ను చెల్లించని వారి ఇండ్లకు కరెంటు కట్ చేస్తామని పట్టణ ప్రజలను హెచ్చరిస్తూ జనగామ పురపాలక కమిషనర్ విడుదల చేసిన ప్రకటనపై పట్టణ ప్రజలు మండిపడుతున్నారు.
పన్ను చెల్లింపునకు పవర్ కట్కు..మున్సిపల్ కమిషనర్కు ఏం సంబంధం..? ఇది ప్రజా పాలనా? లేక ప్రజలను భయపెట్టే పాలనా? అంటూ జనం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. గతంలో ఏనాడూ ఇలాంటి ప్రకటన చూడలేదని..ఇంటి పన్ను చెల్లించకుంటే నల్లా (కుళాయి) నీటి సరఫరా నిలిపివేస్తామని హెచ్చరికలు చేయడం చూశాం కానీ..ఇంటికి కరెంటు కట్ చేస్తామని బెదిరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంటి పన్నులు, నల్లా పన్ను మున్సిపల్ పరిధిలోని అంశం.. కరెంటు ట్రాన్స్కో పరిధిలోని అంశం.. మరి మున్సిపల్ కమిషనర్ కరెంటు ఎలా కట్ చేస్తారు? అంటూ జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.