హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): పంజాబ్, హర్యానా రైతులకు సీఎం కేసీఆర్ అందజేసిన చెక్కులు నగదు రూపంలోకి మారడం లేదన్న కథనాలు అవాస్తవమని సీఎస్ సోమేశ్కుమార్ స్పష్టంచేశారు. లబ్ధిదారులు నిర్ణీత గడువులోగా బ్యాంకులో డిపాజిట్ చేయకపోవడం వల్ల ఈ ఇబ్బంది ఎదురైందని గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దేశ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన 709 రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఈ ఏడాది మే 22న 1,010 చెకులను పంపిణీ చేశారు. ఈ చెకులు నగదు రూపంలోకి మారడం లేదని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రసారం చేశాయని సీఎస్ తెలిపారు. మొత్తం చెకుల్లో 814 చెకులకు నగదు చెల్లింపులు ఇప్పటికే జరిగాయని చెప్పారు.
బ్యాంకు నిబంధనల మేరకు చెక్కు జారీ నాటి నుంచి 3 నెలల్లోగా దానిని బ్యాంకులో డిపాజిట్ చేయాలని, కొందరు లబ్ధిదారులు గడువులోగా బ్యాం కుల్లో డిపాజిట్ చేయకపోవడం వల్ల వారికి నగదుగా మారలేదని చెప్పారు. ఇది సాంకేతిక సమస్యే తప్ప వేరేది కాదని స్పష్టంచేశారు.
రీవాలిడేట్ ఆదేశాలిచ్చాం: సీఎస్
గడువుదాటిన తర్వాత డిపాజిట్ చేసినట్టు చెప్తున్న చెకులకు మరికొంత సమయం ఇచ్చి నగదు చెల్లింపులు జరిగేలా అనుమతివ్వాలని (రీవాలిడేట్) ప్రభుత్వం ఆయా బ్యాంకులకు ఆదేశాలిచ్చిందని సీఎస్ తెలిపారు. సహాయం కోసం ప్రభుత్వ సంయుక్త సెక్రటరీ (రెవెన్యూ శాఖ) రాంసింగ్ను 9581992577 ఫోన్ నం బరులో సంప్రదించవచ్చని సూచించారు.