ఆర్కేపురం, మే 2 : రాష్ట్రంలోని అన్ని కులవృత్తులవారిని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సరూర్నగర్ డివిజన్లో మంజూరైన రెండవ చేపల సంచార విక్రయశాలను ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలో 19 ఫిష్ ఔట్లెట్ స్టాల్స్ మంజూరయ్యాయని అన్నారు. మొత్తం రూ.10లక్షల విలువచేసే స్టాల్స్ను లబ్ధిదారులకు కేవలం రూ.4లక్షలు చెల్లిస్తే మరో రూ.6లక్షలు ప్రభుత్వం భరిస్తుందన్నారు. సంచారశాల లబ్ధిదారులు అవకాశముంటే సొంతంగా చేపలు కొనుగోలు చేయవచ్చని లేనిపక్షంలో మత్స్యశాఖ పంపిణీ చేస్తుందని వెల్లడించారు.
సంచారశాలలో ఉదయం చేపలు అమ్ముకొని, సాయంత్రం ఫిష్ బిరియాని, ఇతర సంబంధిత వస్తువులు విక్రయించి లాభాలు పొందే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని చెరువుల్లో భారీగా పెరిగిన మత్స్య సంపదతో ముదిరాజ్లు, మృత్సకారులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. లాటరీ ద్వారా వాహనం సొంతం చేసుకున్న సరూర్నగర్ డివిజన్కు చెందిన విజయలక్ష్మి సీఎం కేసీఆర్, మంత్రి సబితాఇంద్రారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ డైరెక్టర్ సుకీర్తి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, మీర్పేట కార్పొరేటర్ రేఖాలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.