Medaram Jatara | ఈ నెల 21 నుంచి మొదలయ్యే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. జాతర నిర్వహణ ఏర్పాట్లపై సచివాలంలో వివిధశాఖల ఉన్నతాధికారులతో కలిసి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతరకు ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారని.. జాతర ప్రారంభం కాగానే భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
జాతరకు వచ్చే ప్రతి ఒక్కరూ ఇబ్బందులు లేకుండా గిరిజన దేవతలను దర్శనం చేసుకొని.. తిరిగి సంతోషంతో వెళ్లేలా ఏర్పాటు చేయాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా విస్తృతస్థాయిలో పోలీసు బందోబస్తు, చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతరలో దాదాపు 4800 సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 6వేల బస్సులను మేడారానికి నడుపుతున్నామని.. 55 విస్తీర్ణంలో తాత్కాలిక బస్స్టేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 18 నుంచి 26 వరకు బస్సులను నడుపనున్నట్లు పేర్కొన్నారు.
9వేల బస్ డ్రైవర్లను నియమించినట్లు పేర్కొన్నారు. జాతరలో పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని.. 4వేల మంది కార్మికులను నియమించినట్లు సీఎస్ వివరించారు. జాతర నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా ప్రత్యేకంగా సబ్స్టేషన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. మేడారం గద్దెలను దర్శించకునే వారి కోసం క్యూలైన్స్ ఏర్పాట్లు పూర్తయ్యాయని.. గద్దెల వద్ద నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
జాతర వివరాలను అందించడానికి మేడారంలో ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటుతో పాటు ఫొటో ప్రదర్శన సైతం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. టెలీకాన్ఫరెన్స్లో డీజీపీ రవిగుప్తా, ప్రత్యే కార్యదర్శులు సునీల్ శర్మ, శ్రీనివాస రాజు, సందీప్ కుమార్ సుల్తానియా, రిజ్వీ, వాణీ ప్రసాద్, ఫైర్ సర్వీస్ డీజీ నాగిరెడ్డి, కార్యదర్శులు రాహుల్ బొజ్జా, క్రిస్టినా జెడ్ చోంగ్తు, శరత్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషన్ హన్మంతరావు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్, ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్, వరంగల్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, సీఎం జాయింట్ సెక్రెటరీ సంగీత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.