Telangana Martyrs Memorial | హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజున(జూన్ 22) అమరవీరుల స్మారక స్థూపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ సమీక్ష నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి డీజీపీ అంజనీ కుమార్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. ఈ నెల 22వ తేదీన సాయంత్రం సీఎం కేసీఆర్ అమరవీరుల స్మారక స్థూపాన్ని ప్రారంభిస్తారని, అనంతరం సభా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అమరవీరుల స్మారక స్థూపం ప్రారంభానికి ముందు నెక్లెస్ రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి అమరవీరుల స్మారక కేంద్రం వరకు దాదాపు ఐదు వేల మంది కళాకారులచే ర్యాలీ ఉంటుందన్నారు. దాదాపు గంటన్నర సేపు ఈ ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని, వారికి సరిపడే పార్కింగ్, సీటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డయాస్, నిరంతర విద్యుత్, ఫ్లోరల్ డెకరేషన్, మంచినీటి సౌకర్యాలతోపాటు వేదిక మొత్తం పండగ వాతావరణం వచ్చేలా అలంకరించాలని సూచించారు. కళాకారుల ర్యాలీ జరిగే ఐమ్యాక్స్ సర్కిల్ నుండి అమరుల స్మారక కేంద్రం వరకు రహదారిని అందంగా అలంకరించాలని తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాల మాదిరిగానే, దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం కూడా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.