హైదరాబాద్ : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం మే నెలాఖరు వరకు జరుగుతుందని, కార్యక్రమంలో లబ్ధిదారులకు అందించే ప్రిస్క్రిప్షన్ ఆధారంగా ఇచ్చే కంటి అద్దాల పంపిణీలో జాగ్రత వహించాలని అధికారులను ఆదేశించారు. కంటి వెలుగు, ఇంటి స్థలాల ఎంపిక, పోడు భూముల కేటాయింపు, హరితహారం తదితర అంశాలపై గురువారం కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి, బీఆర్కే భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వేసవి ఎండలు తీవ్రమవుతున్నాయని, కంటి వెలుగు శిబిరాల వద్ద మంచినీటి సరఫరా, నీడ కల్పించేందుకు టెంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే పోడు భూములకు సంబంధించి యాజమాన్య పట్టాలను అందించేందుకు జిల్లాస్థాయి కమిటీలో ఆమోదం పొందిన వాటికి పాస్ పుస్తకాల తయారీ చేపట్టాలన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా 2023 -24 సంవత్సరంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు.
ప్రభుత్వ ఉత్తర్వులు 58 , 59 , 76 , 118 కింద లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన వారికి రిజిస్ట్రేషన్లు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. జిల్లాలో పూర్తయిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల్లోకి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తరలించే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. వీసీలో వీడియో కాన్ఫరెన్స్లో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, పీసీసీఎఫ్ డోబ్రియల్ తదితరులు పాల్గొన్నారు.