CS Shanti Kumari | హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. పోలీసు శాఖ, ఇతర విభాగాల అధికారులతో సీఎస్ మాట్లాడారు. బేగంపేట, శంషాబాద్ ఎయిర్పోర్టుల్లోనూ తనిఖీలు చేపట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. స్మగ్లర్లు ఉపయోగించే రహస్య మార్గాలపై నిఘా ఉంచాలన్నారు. ఇతర రాష్ట్రాల అధికారులతో సమావేశాలు నిర్వహించినట్లు డీజీపీ రవి గుప్తా తెలిపారు. 85 సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 15 రోజుల్లో సుమారు రూ. 35 కోట్లు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ పేర్కొన్నారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకటించిన తర్వాత సమీకృత సరిహద్దు చెక్పోస్టుల ద్వారా వాణిజ్య పన్నుల శాఖ నిఘాను పెంచిన ఫలితంగా రూ. 5.19 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టికె శ్రీదేవి వివరించారు. రాష్ట్రం నుండి బయటకు వచ్చే, వెళ్లే వస్తువులను కూడా మ్యాప్ చేసిందని, ఫలితంగా నేరస్థులను పట్టుకోవడం సులభతరం అయిందని, ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల తయారీ, వ్యాపార గోడౌన్లపై కూడా నిఘా పెంచామని టికె శ్రీదేవి తెలిపారు.
వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, సీనియర్ పోలీస్ అధికారులు మహేష్ భగవత్, సంజయ్ జైన్, రవాణా, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్ రాజు, రవాణా శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.