హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 4న హైదరాబాద్ పర్యటించనున్నారని, ఆమె పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై డీజీపీ అంజనీకుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్లో జూలై 4న సాయంత్రం జరిగే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటారని సీఎస్ తెలిపారు. అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని, లోటుపాట్లు లేకుండా రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలని సీఎస్ సూచించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్శర్మ, అర్వింద్కుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్ జైన్, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, ప్రభుత్వ కార్యదర్శులు శేషాద్రి, శ్రీనివాసరాజు, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, రంగారెడ్డి కలెక్టర్ హరీశ్, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ బీ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.