హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని, ఈ ప్రాజెక్టును పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. కార్పొరేషన్ 24వ బోర్డు సమావేశం సోమవారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాజెక్ట్పై పెట్టుబడిదారులు, వాటాదారుల విశ్వాసాన్ని పెంచడానికి మూసీ పరీవాహక ప్రాంతాన్ని వేగంగా అభివృద్ధి చేసేలా కొన్ని ప్రాజెక్టులను గుర్తించాలని కోరారు. నిపుణుల కమిటీ, సలహా కమిటీల ఏర్పాటుపై నిర్దిష్ట ఉత్తర్వులతో రావాలని అధికారులను ఆదేశించారు.
కార్పొరేషన్ ఎండీ ఆమ్రపాలి ప్రాజెక్ట్లోని అంశాలను వివరించారు. ఆగస్టు నెలాఖరులోగా మాస్టర్ ప్లాన్ ముసాయిదా సిద్ధమవుతున్నదని తెలిపారు. మొదటి దశలో భాగంగా ఉస్మాన్సాగర్ డ్యామ్ డౌన్ స్ట్రీమ్ పాయింట్ నుంచి గౌరెల్లి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వరకు, హిమాయత్ సాగర్ డ్యామ్ డౌన్ స్ట్రీమ్ పాయింట్ నుంచి బాపూఘాట్లో సంగమం పాయింట్ వరకు 55 కిలోమీటర్ల మేర మూసీ నది విస్తరణ ప్రతిపాదనపై బోర్డు చర్చించింది. హైదరాబాద్లో మూసీ నది చుట్టూ ఉన్న వారసత్వ కట్టడాల రక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధి ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవాలని కూడా బోర్డు నిర్ణయించింది. కార్యక్రమంలో పురపాలక శాఖ ముఖ్య సెక్రటరీ దానకిశోర్, హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండీ సుదర్శన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పాల్గొన్నారు.