Drinking Water Crisis | రాష్ట్రంలో తాగునీటి పరిస్థితి, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పాఠశాలల్లో అత్యవసర నిర్వహణ పనులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో తాగునీటి పరిస్థితిని నిశితంగా పరిశీలించి, నిరంతరాయంగా నీటి సరఫరా జరిగేలా అద్భుతమైన టీమ్ వర్క్ చేసినందుకు కలెక్టర్లను ఆమె అభినందించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు కలెక్టర్ల వద్ద తగినన్ని నిధులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు ఇదే విధమైన నిఘా కొనసాగించాలని, ప్రతిరోజూ పరిస్థితిని పర్యవేక్షించాలని ఆమె కలెక్టర్లను కోరారు.
ప్రతి ఇంటికి సరిపడా నీటి సరఫరా ఉండేలా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తాగునీటి పరిస్థితిని పర్యవేక్షించేందుకు నియమించిన ప్రత్యేక అధికారులు గ్రామాలను సందర్శించి నీటి సరఫరాలో జరుగుతున్న అంతరాయాల వివరాలను నేరుగా ప్రజల నుంచి అడిగి తెలుసుకోవాలని ఆమె సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, దాన్యం శుభ్రపరిచే యంత్రాలు, టార్పాలిన్లు ఏర్పాటు చేశామన్నారు. పాఠశాలల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన మరమ్మతు పనులపై ఆమె ప్రస్తావిస్తూ.. నిధులు కూడా విడుదలయ్యాయని, పనులు ప్రారంభించేందుకు ఎన్నికల సంఘం నుంచి అవసరమైన అనుమతులు కూడా రావడంతో పనులు వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్రంలో నెలకొన్న వేడిగాలులపై జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజరీ సిబ్బందికి అవగాహన కల్పించామన్నారు. ఆరోగ్య సదుపాయాలను పెంచడంతోపాటు వేడిగాలుల ఎక్కువగా ఉన్న సమయంలో చేయకూడని పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ప్రిన్సిపల్ సెక్రటరీ పీఆర్ అండ్ ఆర్డీ సందీప్ కుమార్ సుల్తానియా, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీ వెంకటేశం, సీడీఎంఏ దివ్య, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.