హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): మక్కలు, జొన్నలు, శనగలు, కందులు ఇలా వివిధ రకాల పంటల కొనుగోలును బంద్ చేద్దామా..? కొనుగోళ్లకు ఏటా వేలకు వేల కోట్లు ఇవ్వలేం. అందుకే పక్కన పెట్టేందుకు మార్గాల అన్వేషణను వ్యవసాయ యూనివర్సిటీకి అప్పగిద్దాం.. అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు గురువారం జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ చర్చ జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మక్కలు కొనుగోలు చేసేందుకు మార్క్ఫెడ్కు రూ. 4వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ సందర్భంగా కొనుగోలుపై క్యాబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ సందర్భంగా మంత్రులంతా ఒకే విధంగా స్పందించినట్టుగా సమాచారం.
మక్కల కొనుగోలుకు ఇంత డబ్బు అవసరమా..? అనేలా వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మంత్రులంతా కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వైపు ఒక విధంగా చూసినట్టు తెలిసింది. దీంతో వెంటనే స్పందించిన మంత్రి తుమ్మల.. ఇతర మంత్రులకు ఘాటుగానే స మాధానం ఇచ్చినట్టుగా సమాచారం. ‘నాకేం అ వసరం లేదు. మీరు కొనుగోలు చేయాలని చెబి తే కొంటాం. లేకుంటే వదిలేస్తాం.
ఈ బ్యాంకు గ్యారెంటీల నిధులు మొత్తం రైతుల ఖాతాల్లోకే వెళుతుంది.’ అంటూ సమాధానం చెప్పినట్టుగా తెలిసింది. ఈసందర్భంగా సీఎం కల్పించుకొని సర్దిచెప్పినట్టుగా సమాచారం. పంటల కొనుగోలుపై ఏం చేద్దామంటూ ఆయన ఇతర మంత్రులను ప్రశ్నించినట్టుగా తెలిసింది. అయితే ఒక్కసారిగా బంద్ చేస్తే రైతుల్లో వ్యతిరేకత వస్తుందని, దీన్ని నెమ్మదిగా తగ్గించే ప్రయత్నం చేయాలనే అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది.
కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే పంటల కొనుగోలు అరకొరగా చేస్తున్నది. గురువారం క్యాబినెట్ భేటీలో జరిగిన చర్చను గమనిస్తే ఇకపై పంటల కొనుగోలు కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సీజన్లోనూ సకాలంలో పంటలు కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేయడం పరిపాటిగా మారిందనే విమర్శలున్నాయి. ముఖ్యంగా మక్కలు, జొన్నలు, శనగలు, కందులు, సన్ఫ్లవర్ పంటలు కొనుగోలు చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. రైతులు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తేగానీ కొనుగోళ్లను ప్రారంభించని పరిస్థితి నెలకొన్నది. అది కూడా అరకొరగా కొనుగోలు చేసి మమా అనిపించేస్తున్నది. ఇందుకు తాజా కొనుగోళ్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
30 లక్షల టన్నుల మక్కలు ఉత్పత్తి కాగా కేవలం సగం మక్కల కొనుగోలుకు మాత్రమే ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇక జొన్నల కొనుగోలును పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇప్పటివరకు జొన్నల కొనుగోలుకు సంబంధించి ఆమోదమే తెలుపలేదు. జొన్నల కొనుగోలుకు సంబంధించిన ఫైల్ సీఎం రేవంత్రెడ్డి వద్ద పెండింగ్లో ఉన్నట్టుగా తెలిసింది. ఓవైపు పంటలు కోసి మార్కెట్లో మద్దతు ధర దక్కక రైతులు గగ్గోలు పెడుతుంటే.. ప్రభుత్వం మాత్రం కొనుగోళ్లకు ఆమోదం ఇవ్వకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే శనగ కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఆధారపడింది. కేంద్రం 29వేల టన్నులకు ఆమోదం ఇవ్వగా ఆ కోటా పూర్తయింది. ఇప్పుడు రాష్ట్ర కోటాలో కొనుగోలు చేయాల్సి ఉండగా.. సర్కార్ మాత్రం సడీసప్పుడు చేయడంలేదు. ఇలా రైతుల నుంచి పంటల కొనుగోళ్లకు కాంగ్రెస్ సర్కారు సుముఖంగా లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
పంటల కొనుగోలు, ఆర్థిక భారానికి రాష్ట్ర సర్కార్ లంకె పెడుతున్నది. ఇటీవల మక్కలకు రూ. 4వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇవ్వడానికి మల్లగుల్లాలు పడినట్టు తెలిసింది. ఇప్పుడు జొన్నలు కొనుగోలు చేయాలంటే మరో రూ. వెయ్యి కోట్లు, శనగల కోసం మరో రూ. 500 కోట్లు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నిధులు కేటాయించేందుకు సర్కార్ సిద్ధంగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు నెమ్మదిగా పంటల కొనుగోలుకు చరమగీతం పాడేందుకు సర్కార్ స్కెచ్ వేస్తున్నదనే విమర్శలు వినిస్తున్నాయి.