హైదరాబాద్, మే 7(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనం కన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాగు సమయంలో వేయాల్సిన రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ఓట్ల సమయంలో వేయడం అందులో భాగమేనని చెప్తున్నారు. సాగు సమయంలో వేస్తే తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, అదే ఓట్ల సమయంలో వేస్తే లబ్ధిపొందవచ్చునన్న ఉద్దేశంతోనే రైతుబంధు సాయాన్ని ఇప్పుడు విడుదల చేసిందని విమర్శిస్తున్నారు.
జనవరి, ఫిబ్రవరిలో పూర్తికావాల్సిన పంపిణీని కావాలని ఇప్పటి వరకు జాప్యం చేసిందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఓవైపు కరువు, సాగునీళ్లు లేకపోవడం, పంటలు ఎండిపోవడం, పండిన పంటలను కొనుగోలు చేయకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులకు పీకలదాకా కోపం ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైతే ఇబ్బంది తప్పదని భావించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 8నాటికి రైతుబంధు పంపిణీని పూర్తిచేస్తామని ప్రకటించారు.
యాసంగి రైతుబంధు పంపిణీని ప్రభుత్వం డిసెంబర్ 9న ప్రారంభించి మార్చి నెలాఖరు వరకు ఐదెకరాల రైతులకు పంపిణీ చేసి మిగతా వారికి నిలిపివేసింది. మరో రూ. 2,300 కోట్లు సమకూర్చితే మొత్తం పంపిణీ పూర్తయ్యేది. నిధుల కొరతను సాకుగా చూపి పంపిణీ నిలిపివేసింది. మరో వారం రోజుల్లో ఎన్నికలు ఉండడంతో మిగతా రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేసింది. అప్పుడు లేని డబ్బులు ఇప్పుడెలా వచ్చాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రైతుల ఓట్లు దండుకునేందుకే ప్రభుత్వం ఈ డ్రామా ఆడిందని విమర్శిస్తున్నారు.
సాగు పెట్టుబడికి ఇబ్బంది రావొద్దనే ఉద్దేశంతో యాసంగి పెట్టుబడి సాయాన్ని సకాలంలో అందించాలని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు ఎన్నికల కోడ్ ఉందంటూ ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి మరీ రైతులకు పెట్టుబడి సాయం అందకుండా అడ్డుకున్నది. అప్పుడు ఎన్నికల కోడ్ సాకు చెప్పి అడ్డుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఓటింగ్కు కేవలం వారం రోజుల ముందు రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ చేయడం గమనార్హం. తద్వారా రైతులకు పెట్టుబడి కష్టాలు తెచ్చిన కాంగ్రెస్, తన రాజకీయ ప్రయోజనాలను మాత్రం కాపాడుకుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రైతుబంధు పంపిణీని ఆపేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల కోడ్ నిబంధనలను సీఎం రేవంత్రెడ్డి ఉల్లంఘించడం వల్లే రైతుబంధు పంపిణీని నిలిపేసినట్టు పేర్కొంది. వాస్తవానికి ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ రైతుబంధు పంపిణీకి ఈసీ అనుమతినిచ్చింది. అయితే దీనిపై ఎక్కడా ప్రచారం చేసుకోవద్దని షరతు విధించింది. రేవంత్రెడ్డి మా త్రం ఈసీ నిబంధనలను ఉల్లంఘించి 8నాటికి రైతుబంధు పూర్తిచేస్తామని బహిరంగంగా ప్రకటించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు అందడంతో రేవంత్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ రైతుబంధు పంపిణీని ఆపేసింది. పోలింగ్ తర్వాతే మళ్లీ ప్రారంభించాలని ఆదేశించింది.