Telangana | కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గురించి ఏ మాత్రం పట్టింపులేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వడగండ్ల వర్షాలు రాబోతున్నాయని వారం క్రితమే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి తోడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వర్షాలు వచ్చే అవకాశం ఉందని, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టింది. యథావిధిగానే కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించింది. దీంతో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం మొత్తం తడిసిపోయింది.
కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతుల తిప్పలు అన్నీ ఇన్నీ కావు. కండ్ల ముందే ధాన్యం కొట్టుకుపోతుంటే రైతుల దుఃఖం వర్ణనాతీతం. వర్షపు నీళ్ల నుంచి ధాన్యాన్ని చేతులతో ఎత్తుకుంటున్న పరిస్థితి హృదయ విదారకరంగా ఉంది. ఇలా ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆరు గాలం కష్టం చేసి పండించిన ధాన్యం నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.