హైదరాబాద్, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించిన కేంద్ర ఎన్నికల సంఘంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేందుకు అనుమతిస్తూ ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్కు రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం ఘోర తప్పిదం చేసింది. అడ్రస్లో బంజారాహిల్స్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్గా పేర్కొన్నది. ఈసీ తప్పిదంపై నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. అజ్ఞానంతో రాష్ట్రం పేరునే తప్పుగా రాయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ను ఇంకా ఏపీలోనే ఉన్నట్టుగా ఈసీ భావించిందంటే.. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని గుర్తించలేదనే భావన కలుగుతున్నదని కోపోద్రిక్తులయ్యారు. మరో గమ్మత్తు ఏంటంటే… ఈ లేఖ ప్రతిని ఏపీ, తెలంగాణ రెండు రాష్ర్టాల ప్రధాన ఎన్నికల అధికారులకు పంపించడం గమనార్హం. తెలంగాణలో పుట్టిన పార్టీ జాతీయపార్టీగా మారితే ఆ లేఖను ఏపీ ఎన్నికల అధికారికి పంపించాల్సిన అవసరమేమిటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవేళ ఏపీకి పంపించాల్సి వస్తే దేశంలోని మిగతా రాష్ర్టాలకు కూడా పంపించాలనే వాదన వినిపిస్తున్నది. ఎన్నికల సంఘానికి ఏపీ, తెలంగాణ రాష్ర్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఇప్పటికీ లేదనే విషయం తేటతెల్లమైందనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తంచేస్తున్నారు. దేశంలో ఎన్ని రాష్ర్టాలు ఉన్నాయో కూడా తెలియని ఈసీ ఏకంగా ఎన్నికలు నిర్వహిస్తుందని, ఇలాంట ఈసీ ఉండడం మన ఖర్మ అంటూ విమర్శిస్తున్నారు.