హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ఏపీ నుంచి వచ్చే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రెండు మొబైల్ బృందాలను ఏర్పాటు చేసినట్టు ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) తెలిపింది. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో చెక్పోస్టులు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశామని, వీటిద్వారా నిఘా పెడుతున్నట్టు వివరించింది. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో సోమవారం వచ్చిన ‘ఇసుక ధర డబుల్’ వార్తపై టీఎస్ఎండీసీ జనరల్ మేనేజర్ స్పందించారు. తమ వెబ్సైట్ ఓపెన్ అవుతున్నదని, వినియోగదారులకు కావాల్సినంత ఇసుక అందుబాటులో ఉన్నదని స్పష్టం చేశారు. ఇసుక ధరలు పెరిగాయా? లేదా? అన్న విషయంపై మాత్రం మాట్లాడలేదు. తమ వెబ్సైట్ ఓపెన్ కావడం లేదన్న ఫిర్యాదులేమీ రాలేదని తెలిపారు. జనవరిలో 31.75 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నదని, దాంతో కేవలం 14.79 లక్షల టన్నుల ఇసుకకు మాత్రమే బుకింగ్లు వచ్చాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 32 లక్షల టన్నుల ఇసుక డిపోల్లో అందుబాటులో ఉన్నదని తెలిపారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే ఇసుకపై మాత్రమే రెగ్యులేటింగ్ చార్జీలు వసూలు చేస్తున్నట్టు చెప్పారు. ఇసుక సరఫరా విషయంలో ఏవైనా ఫిర్యాదులుంటే తమ టోల్ ఫ్రీ నంబర్ 040-155242ను సంప్రదించాలని కోరారు.