ఖమ్మం, ఫిబ్రవరి 27: బీజేపీతో దేశానికి ప్రమాదం ముంచుకొస్తున్నందున ఆ పార్టీ వ్యతిరేక శక్తుల సమీకరణే లక్ష్యంగా తమ పార్టీ ముందుకు వెళ్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నూతన ఆర్థిక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తూ ప్రభుత్వరంగ కంపెనీలను ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఖమ్మంలోని మంచికంటి భవన్లో సోమవారం నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ వైఖరి రీత్యానే బీఆర్ఎస్తో మైత్రి కొనసాగుతున్నదని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తమ జాతీయ కమిటీ పిలుపు మేరకు మార్చి 17 నుంచి ప్రజాగర్జన యాత్రలు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని విమర్శించారు. అక్రమ పద్ధతిలో మోదీ ప్రభుత్వం అందించిన సహకారంతోనే అదానీ ప్రపంచ కుబేరుల స్థానంలో నిలిచాడని హిండెన్బర్గ్ నివేదిక సృష్టం చేసినట్టు గుర్తుచేశారు. తమ వ్యతిరేక శక్తులను బెదిరించేందుకే బీజేపీ ప్రభుత్వం ఈడీని వాడుకుంటున్నదని ఆరోపించారు.