మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 23: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. గురువా రం ఆయన మహబూబాబాద్లో మీడియాతో మాట్లాడారు. దేశంలో పేదలపై బీజేపీ ప్రభుత్వం అనేక భారాలు మోపుతున్నదని మండిపడ్డారు. బీజేపీ విధానాలను తిప్పి కొట్టడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. దేశంలో నిరుపేదలకు ఉపయోగపడే అనేక పథకాలను మోదీ సర్కార్ నిర్వీర్యం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ ఉపాధి హామీకి కొర్రీలు పెట్టడంతో అనేకమంది నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దేశ సంపదను దోచుకుంటున్న అదానీకి కేంద్రం మద్దతుగా నిలుస్తున్నదని విమర్శించారు. బీజేపీ విధానాలను కేసీఆర్ దీటుగా ఎదుర్కొంటున్నారని చెప్పారు. దేశ రాజకీయాల్లో మార్పు తెచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీని తెచ్చారని, ఒక బలమైన ప్రతిపక్షంగా తయారై మోదీని ఎదుర్కొనే విధంగా కేసీఆర్ పోరాటం చేస్తున్నారని కొనియాడారు.