హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిర్దిష్టమైన వ్యవసాయ ప్రణాళిక లేకపోవడం, ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం పేర్కొంది. రైతు సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్రెడ్డికి సీపీఎం నాయకులు ఎస్ వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, జీ నాగయ్య, టీ సాగర్ లేఖ రాశారు. ఇటీవల సీపీఎం ప్రతినిధుల బృందం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించిదని, ఈ సందర్భంగా పలు సమస్యలను గుర్తించిందని ఆ లేఖలో పేర్కొన్నారు.
మేడిగడ్డలో కుంగిన పిల్లర్లు రోజురోజుకు మరింత కుంగుతున్నాయని, వర్షాలు పడితే మరింత కుంగిపోయే ప్రమాదముందని తెలిపారు. అన్నారం బ్యారేజీ వద్ద ఏర్పడిన బుంగను తాత్కాలికంగా పూడ్చినప్పటికీ ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పారు. అయితే ఈ సమస్యలను పరిష్కరించడానికి కొంత సమయం పట్టే అవకాశమున్నప్పటికీ రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీరాం సాగర్, మానేరు, మల్లన్నసాగర్ తదితర జలాశయాల్లోని నీటి నిల్వలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాగునీటి విడుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించి నీటిని రైతులకు అందించాలని సూచించారు. నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని సీపీఎం నాయకులు కోరారు.