హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో చదివే విద్యార్థుల్లో ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులు కేవలం 28 శాతం మాత్రమే ఉన్నారు. అంటే 70.43 శాతం మంది ప్రైవేట్ బడులకు వెళ్తున్నారు. రానురాను ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వ బడుల్లో ఎన్రోల్మెంట్ మరింత తగ్గే ప్రమాదం పొంచి ఉన్నది.
ఈ విషయాన్ని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఆన్ ఎడ్యుకేషన్ ప్లస్ 2025-26 నివేదిక తాజాగా వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2025-26 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో 6,39,730 మంది విద్యార్థులు ఒకటో తరగతిలో ప్రవేశాలు పొందారు. వీరిలో కేవలం1,83,974 (28 శాతం) మంది మాత్రమే సర్కార్ బడుల్లో ఒకటో తరగతిలో చేరారు. ఎయిడెడ్ బడుల్లో 4,997(0.78శాతం) మంది మాత్రమే ఉన్నారు.
అదే ప్రైవేట్ స్కూళ్లల్లో ఏకంగా 4,50,578 (70.43శాతం) మంది చేరారు. కేంద్రం వెల్లడించిన ఈ గణాంకాలు ప్రభుత్వ విద్యపై ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో అమ్మాయిలు, అమ్మాయిల చదువులపై ఇంకా వివక్ష కనిపిస్తున్నది. అబ్బాయిలను ప్రైవేట్కు, అమ్మాయిలను సర్కార్ బడులకు పంపిస్తున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. సర్కార్ బడుల్లో అబ్బాయిలతో పోల్చితే లక్ష మంది అమ్మాయిలు ఎక్కువగా చదువుతుంటే, ప్రైవేట్లో అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిలు నాలుగు లక్షల మంది ఎక్కువగా చదువుతుండటం గమనార్హం.
