సూర్యాపేట : ఆశీర్వాద యాత్రల పేరిట భారతీయ జనతా పార్టీ ప్రజలను నయవంచనకు గురి చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. బీజేపీ ఆశీర్వాద యాత్రను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజలను మోసం చేసేందుకే ఈ యాత్ర అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూర్యాపేటలోని ఎంవీఎన్ భవన్లో రంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసం పని చేస్తుందని ధ్వజమెత్తారు. విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకురాలేదు. కోటి ఉద్యోగాలు భర్తీ చేయలేదు. సామాన్యుల బాధలను మోదీ పట్టించుకోవడం లేదని నిప్పులు చెరిగారు. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని బీజేపీ, ప్రజలకు ఏం చేశారని యాత్రలు చేస్తున్నారని రంగారెడ్డి ప్రశ్నించారు.
దేశ సంపదను కార్పొరేట్లకు అప్పనంగా అమ్మేస్తూ లూటీ చేస్తున్నారని రంగారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకింగ్, ఎల్ఐసీ, విమానయాన రంగాలను ప్రయివేటుపరం చేయడం దుర్మార్గమన్నారు. సామాన్యుడి నడ్డి విరిచే విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడం దారుణమన్నారు. ప్రజలను మరోసారి నయవంచన చేసేందుకే కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు ఆశీర్వాద యాత్రలు చేస్తున్నారని రంగారెడ్డి విమర్శించారు. అన్ని సామాజిక వర్గాల కంటే అత్యంత వెనుకబడి ఉన్న దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు దళిత బంధు పథకం ప్రవేశపెట్టడం మంచిదే అని రంగారెడ్డి స్పష్టం చేశారు.