నల్లగొండ: కేంద్రంలోని మోదీ (PM Modi) ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ సీపీఎం (CPM) తిప్పికొడుతుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని (BJP) ఓడించి గద్దెదించడమే లక్ష్యంగా తమ పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు. బీజేపీ మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్ శక్తులను వ్యతిరేకిద్దాం, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం పోరాడుదామనే సంకల్పంతో సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య యాత్ర నల్లగొండకు చేరుకుంది. ఇందులో భాగంగా కలెక్టరేట్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా, ఆ పార్టీని ఓడించేందుకే తాము బీఆర్ఎస్కు (BRS) మద్దతిస్తున్నామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు మద్దతు కొనసాగిస్తామని, సీఎం కేసీఆర్ (CM KCR) సూచనలతో ముందుకు సాగుతామన్నారు. భవిష్యత్తులో బీజేపీని వ్యతిరేకించే పార్టీలను కలుపుకొని బలమైన పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజా సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని పిలుపునిచ్చారు. మోదీని గతింపడమే లక్ష్యంగా కమ్యూనిస్టు పార్టీలు పనిచేస్తాయన్నారు. వ్యవసాయాన్ని నాశనం చేసేలా బీజేపీ ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. దానికి వ్యవసాయ చట్టాలే నిదర్శనం అన్నారు. వాటిని రద్దు చేయాలని బలమైన పోరాటం సాగడంతోనే కేంద్రం వెనకకు తగ్గిందన్నారు. కేంద్రంలో మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ వారు సాగించిన పాలనని చూస్తామని, ఇది ఎంతో ప్రమాదకరమన్నారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని స్పష్టంచేశారు.
బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ సంస్థలను తెగనమ్ముకుంటున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం 8 సంవత్సరాల కాలంలో రూ.100 లక్షల కోట్ల అప్పులను చేసిందని వెల్లడించారు.