హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ సహకారంతోనే పారిశ్రామికవేత్త అనిల్అంబానీ ఎల్ఐసీ నుంచి రూ.3,400 కోట్లు లూటీ చేసి, ఎల్ఐసీ తీవ్రంగా నష్టపోవడానికి కారణమయ్యాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీఎస్ బోస్ ఆరోపించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. అనిల్ అంబానీ వంటి కుటిల వ్యాపారులకు ప్రధాని మోదీ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
రైతులు, బడుగు వర్గాల ప్రజలు సకాలంలో రుణాలు చెల్లించకపోతే జైళ్లకు పంపుతున్నారని, అదే అనిల్ అంబానీ లాంటి కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరిచి వేలకోట్ల రుణమాఫీని చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతున్నదని చెప్పారు. సామాన్యులు కష్టార్జితాన్ని ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టుకున్నారని, డిఫాల్ట్ చేసిన రుణాలను రికవరీ చేయకపోతే సామాన్య ప్రజలే నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేశారు.