హనుమకొండ/హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 5 : సైబర్ నేరాలపై అవగాహన పెంచాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ చేపట్టిన ‘సురక్ష తిరంగా’ కార్యక్రమంలో భాగంగా హనుమకొండలోని కాళోజీ కళా క్షేత్రంలో ఉపాధ్యాయులు, నిట్లో అధ్యాపకులు, విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై ఎలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు వివరించడంతో పాటు పోలీస్ జాగృతి కళాబృందం సభ్యుల సాంసృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ అత్యాశ, భయం, అత్యవసరం లాంటి కారణాలతో ప్రజలు సైబర్ మోసాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా సెల్ఫోన్ల వినియోగం సమయంలో అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే మె సేజ్లు, ఫొటోలపై క్లిక్ చేయడం చాలా ప్రమాదమని వివరించారు. తమ సెల్ ఫోన్ ఏ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్తుందో తెలియదని, ప్రతి వినియోగదారుడు తప్పకుండాసెట్టింగుల్లో మార్పు చేసుకోవాలని సూచించారు. అలాగే పిల్లలకు ప్రైవేట్, పబ్లిక్ లైఫ్లపై అవగాహన కల్పించాలన్నారు.
ఎంతో మంది తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఫొటోలు, సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో అనేక అనర్థాలు జరుగుతున్నాయన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉంటామంటూ ప్రతిజ్ఞ చేయించడంతో పాటు, అవగాహన కల్పిస్తూ రూపొందించిన పోస్టర్ను సీపీ ఆవిషరించారు. కృత్రిమ మేధస్సు ఆధారిత సైబర్ భద్రత, డీప్ ఫేక్ గుర్తింపు వంటి రంగాల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్తో కలిసి పనిచేస్తామని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, విద్యాశాఖ సీఎంవో సుమ, హనుమకొండ, సైబర్ క్రైమ్, ఎస్బీ ఏసీపీలు నర్సింహరావు, వెంకటరమణ, జాన్ నర్సింహులు, ఇన్స్పెక్టర్లు రంజిత్, శివకుమార్, రవికుమార్, అశోక్, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.