హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ‘చలో రాజ్భవన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా పనిచేసినట్టు ఇప్పటివరకు ఆధారాలు లేవని చెప్పారు. గవర్నర్ వ్యవస్థతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని, అందుకే ఈ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మగ్ధూంభవన్లో మంగళవారం కూనంనేని మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత రాష్ట్ర గవర్నర్ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు.
రాజ్యాంగంలో బిల్లులను ఎంత కాలం నిలుపుదల చేయాలో గడువు లేకపోవడంతో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం, ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాతంత్ర శక్తులపైనే ఉన్నదని, ముఖ్యంగా కమ్యూనిస్టులపైనే ఉన్నదన్నారు. గవర్నర్ వ్యవస్థపైన సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ నెల 29న ‘సేవ్ ఫెడరలిజం డే (సమాఖ్యవాద పరిరక్షణ దినోత్సవం) నిర్వహించనున్నట్టు తెలిపారు. షర్మిల అరెస్ట్ పట్ల ప్రధాని, గవర్నర్ స్పందించారని, మోదీ తనకు ఇష్టమైన వారి అరికాళ్లలో ముళ్లు గుచ్చుకుంటే నోటితో తీస్తారని మీడియా అడిగిన ప్రశ్నలకు కూనంనేని సమాధానంగా చెప్పారు. వరవరరావు, సాయిబాబాలను అరెస్టు చేసి జైళ్లలో ఏండ్ల తరబడి బంధించిన అంశంపై ప్రధాని ఎందుకు స్పందించరని నిలదీశారు.
సుప్రీంకోర్టు ఆలోచించాలి
గవర్నర్ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత, స్వతంత్రంగా పనిచేయాల్సిన సీబీఐ, ఈడీలను ప్రక్షాళన చేసేలా సుప్రీంకోర్టు ఆలోచన చేయాలని, లేదంటే ప్రతిపక్ష పార్టీలు, ప్రశ్నించే వారు బతుకలేరని కూనంనేని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కంటే మించి బీజేపీ పాలనలో ముఖ్యంగా గత ఎనిమిదేండ్లలోనే సీబీఐ, ఈడీల దుర్వినియోగం జరిగిందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ ప్రవేశించరాదని, కానీ సీబీఐ ప్రవేశిస్తున్నదన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నదని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మిలిటెంట్ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెలాఖరు వరకు దేశవ్యాప్తంగా మిలిటెంట్ పోరాటాలు చేపట్టాలని తీర్మానించామన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్రెడ్డి, తకెళ్లపల్లి శ్రీనివాస్రావు, ఎన్ బాలమల్లేశ్, కలవేన శంకర్ పాల్గొన్నారు.