హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): గుజరాత్ నమూనా విఫలం కావడం, మోదీ నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబడుతుండటం, తెలంగాణలో అమలవుతున్న పథకాలను దేశంలోని మిగతా రాష్ర్టాలు అనుసరిస్తున్నాయన్న అక్కసుతోనే కేంద్రం తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. అందుకే బయ్యా రం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటును అడ్డుకుంటున్నదని చెప్పారు. రాష్ట్ర విభజన హామీలపై జాతీయస్థాయిలో చర్చలు జరుగుతున్న సందర్భంలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రకటించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రకటన కేంద్రానికి, మోదీకి రాజ్యాంగంపై, చట్టాలపై లెక్కలేనితనాన్ని తెలియజేస్తున్నదని పేర్కొన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు ఆవశ్యకత, ఫ్యాక్టరీ సాధనకు సీపీఐ చేపట్టే కార్యాచరణను కూనంనేని ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేకంగా వివరించారు.
బయ్యారం ప్రకటనను ఎలా చూడొచ్చు ?
తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. కేవలం మోదీ మెప్పు పొందేందుకే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేమని ప్రకటించారు.
కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఎలా ప్రకటించారు ?
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కూడా ఖనిజ వనరులు లేవన్నారు. దీనికి ఇతర ప్రాంతాల నుంచే ఖనిజం రవాణా చేశారు. ఆ తర్వాత లాభాలు వచ్చాయి. దాన్ని అదానీకి కట్టబెట్టేందుకు నష్టాలు చూపిస్తున్నారు. కేంద్రం ఎన్ఎండీసీ నిపుణులతో చర్చించాలి. ఏకపక్షంగా నాణ్యత లేదని ప్రకటించడం వెనుక మోదీ అహంభావం, రాజకీయ కక్ష కనిపిస్తున్నది.
విభజన హామీలపై తెలంగాణ, ఏపీకి తేడా?
రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లు దాటినా కేంద్రం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నది. తెలంగాణపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, 9,10వ షెడ్యూళ్లలోని అంశాల పరిష్కారం, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఆర్థిక సంఘం, నీతిఆయోగ్ సిఫార్సుల అమలు వంటి అంశాలను పూర్తిగా పక్కకు పెట్టింది. అదే ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నది.
బీజేపీ నియంతృత్వ విధానాలపై సీపీఐ కార్యాచరణ ?
తెలంగాణలో బీజేపీ విస్తరించకుండా అడ్డుకోవడమే సీపీఐ లక్ష్యం. బీజేపీ చాలా ప్రమాదకరమైన పార్టీ. మతోన్మాదంతో అరాచకం సృష్టిస్తున్నది. ఇప్పటికే దేశంలో వివిధ రంగాలు ప్రమాదకరస్థితిలో పడ్డా యి. వ్యవసాయం కుదేలవుతున్నది. ఆహారభద్రత తలెత్తే ప్రమాదం ఉన్నది. నిరుద్యోగం పెచ్చరిల్లింది. ద్రవ్యోల్బణం విజృంభిస్తూ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. జీఎస్టీతో పేదల జేబులకు చిల్లుపెట్టారు.
గత ప్రభుత్వాలకు, బీజేపీకి తేడా?
బీజేపీ రాజకీయాలు కక్షపూరితం. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి ప్రభుత్వాలను కూల్చుతున్నారు. దేశంలో శ్రీలంక పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీని అడ్డుకోవడానికి ప్రజాస్వామ్య, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు, పార్టీలను ఏకం చేసేందుకు సీపీఐ కృషి చేస్తున్నది. అందుకే మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చాం. కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతాం.
ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎందుకీ అడ్డంకులు ?
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటును కేంద్రం రాజకీయంగా చూస్తున్నది. బయ్యారం, గార్ల నుంచి గతంలో ఇనుప ఖనిజం, బెరైటీస్ను ప్రైవేటు కాంట్రాక్టర్లు తరలించుకుపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సర్కారు గనుల తవ్వకానికి దాదాపు 1.40 లక్షల ఎకరాలను రక్షణ స్టీల్ కంపెనీకి కేటాయించింది. దీనిపై ఖమ్మంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టాం. ప్రభుత్వం దిగొచ్చి రక్షణ స్టీల్ కంపెనీకి కేటాయించిన భూమిని రద్దు చేసింది. రాష్ట్ర విభజన సమయంలో కడప, బయ్యారంలలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎనిమిదేండ్లు గడిచినా ఒక్క అడుగు ముందుకు పడలేదు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రకటనపై మీ ఉద్యమ పంథా?
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధించే వరకు సీపీఐ పోరాటం ఆగదు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రులు, రాజ్భవన్ కార్యకలాపాలను స్తంభింపజేస్తాం. నిరసన కొనసాగిస్తాం. కేంద్ర మంత్రులను నిలదీస్తాం.
బయ్యారం ఉక్కు నాణ్యత లేదు. ఫ్యాక్టరీ వల్ల నష్టాలు వస్తాయన్నది వాస్తవమా ?
బయ్యారం ఉక్కు నాణ్యత లేనిదని చెప్పడం పూర్తి అబద్ధం. కేవలం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటును అడ్డుకొని, విలువైన ఖనిజాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే కుట్ర. బయ్యారం ఖనిజానికి నాణ్యత లేదని ఏ ఆధారాలతో ప్రకటించారు ? మంత్రులకు నాణ్యత ఎలా తెలుస్తుంది ? అప్పటి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి భైరాన్సింగ్ షెకావత్, ఎన్ఎండీసీ అధికారులు బయ్యారాన్ని సందర్శించి, దాదాపు 300 మిలియన్ టన్నుల ఖనిజం, 65 శాతం క్వాలిటీ ఉన్నదని ప్రకటించారు.