హైదరాబాద్ : కమ్యూనిస్టులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. చట్టాలు, వ్యవస్థపై నమ్మకం లేని వ్యక్తం బండి సంజయ్ అని, అసహనంతో మాట్లాడుతున్నారని. అడ్డంగా దొరికినా బుకాయిస్తున్నారంటూ ఘాటూనే స్పందించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధం లేని విషయాల్లో బండి సంజయ్ ఎందుకు మాట్లాడుతున్నాడని ప్రశ్నించారు.
ఢిల్లీ డీల్పై నువ్వెందుకు ప్రమాణాలు చేస్తున్నావని ప్రశ్నించారు. ధైర్మం, దమ్ము ఉంటే మోదీతో ప్రమాణం చేయించాలని డిమాండ్ చేశారు. దేవుడంటే భక్తి లేదని, నమ్మకం లేదని, మతంపేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టు పార్టీలు వేల కోట్లు తీసుకున్నారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని, బీజేపీని గద్దె దించేందుకే తాము లౌకిక శక్తులతో పోరాటం చేసేందుకే కలిశామన్నారు. సంజయ్ దమ్ముంటే రాజ్యాంగంపై ప్రమాణం చేయాలని, బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. వారికి ఎన్ని వేల కోట్లు ఇచ్చారని నిలదీశారు.
మీరు చేస్తే సంపారం.. తాము పొత్తు పెట్టుకుంటే తప్పా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యవస్థలా సీబీఐ తయారైందని, చాలా రాష్ట్రాలు సీబీఐని బహిష్కరించాయన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోకి సీబీఐ అనుమతి లేదని జీవో ఇచ్చిందని, వచ్చే ఎన్నికల్లో రూపాయి ఖర్చు పెట్టకుండా ఎన్నికల బరిలో ఉంటామని ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయవచ్చా? అని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు.
కమ్యూనిస్టులు ఎప్పుడూ తప్పు చేయరని, సిద్ధాంత ప్రకారమే పోరాటాలుంటాయని స్పష్టం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రాజకీయాలను మోదీ భ్రష్టు పట్టించారని, తెలంగాణకు అన్నిరంగాల్లో అన్యాయం చేశారని ఆరోపించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బండి సంజయ్ ఇక్కడో మా మాట్లాడుతాడని, ఢిల్లీలో చప్పుడు చేయడని విమర్శించారు. కమ్యూనిస్టులు కొత్తగా పొత్తులు పెట్టుకోలేదని, తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, అందుకే టీఆర్ఎస్తో కలిసి పని చేస్తున్నామన్నారు. మునుగోడు ఎన్నికల్లో ప్రజలు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలిపించాలని కోరారు. రాజగోపాల్రెడ్డి స్వార్థం కోసం ఉప ఎన్నిక వచ్చిందని పల్ల వెంకట్రెడ్డి అన్నారు. మునుగోడులో బీజేపీ మూడోస్థానానికే పరిమితమవుతుందని స్పష్టం చేశారు.