హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రాలపై నెపం నెట్టకుండా చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వమే తన బాధ్యతగా తక్షణమే పంటలకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. కౌలు రైతుల పంటలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. పంటల బీమా పథకాన్ని కేంద్రం నిలిపివేయడం దురదృష్టకరమని, వెంటనే అమలు చేయాలని అన్నారు. 3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు 10 లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. మార్చిలో కురిసిన వర్షాల కారణంగా 6 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్నదని, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున పరిహారం ఇస్తామని పంటల పరిశీలన సం దర్భంగా సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారని, దానికి రైతులు కూడా సంతృప్తి చెందారని పేర్కొన్నారు. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఎకరాల్లో మామిడి, 6 లక్షల ఎకరాల్లో మకజొన్న, మిర్చి, ఇతర ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యా న్ని తేమ శాతంతో సంబంధం లేకుండా, ఎలాంటి షరతులు విధించకుండా ఎఫ్సీఐ తీసుకోవాలని డిమాండ్ చేశారు.