సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ
సంగారెడ్డి అర్బన్, మే 30: పెరుగుతున్న ధరలతో కార్మికుల జీవితాలు దుర్భరమవుతున్నాయని, ధరలు తగ్గించే వరకు ప్రజాపోరాటాలు చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. పెరిగిన ధరలను వ్యతిరేకిస్తూ సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ వీరారెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలనలో ధరల పెరుగుదలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు.
నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఇష్టానుసారంగా పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలో మతోన్మాదం సృష్టించి చిచ్చు పెట్టేవిధంగా మోదీ పర్యటనలు ఉంటున్నాయని దుయ్యబట్టారు. మోదీ ప్రవర్తన ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీ మోతలా ఉన్నదని ఎద్దేవాచేశారు. ఎరువులు, విత్తనాల ధరలు కూడా పెరగడంతో వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతన్న పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.