రవీంద్రభారతి, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవితాన్ని అంకితమిచ్చారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ శ్లాఘించారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో గురువారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో జయశంకర్ జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా దేశపతి మాట్లాడుతూ.. జయశంకర్కు చిన్నప్పటి నుంచే తెలంగాణ స్వరాష్ట్రంగా కొనసాగాలని ఉండేదని గుర్తుచేశారు. తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడటానికి జయశంకర్ పోరాటం దోహదపడిందని వివరించారు. తెలంగాణ సంస్కృతిని కాపాడటంలో జయశంకర్ ప్రధాన పాత్ర పోషించారని, తెలంగాణ భావజాలాన్ని కఠోరదీక్షతో ప్రజల ముందుంచారని చెప్పారు.
కేసీఆర్తో సన్నిహితంగా ఉంటూ రాష్ట్ర సాధన ఉద్యమానికి తగు సూచనలు, సలహాలు అందించారని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భవించకముందే ఆయన తుది శ్వాస విడువడం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణపై అనేక పరిశోధనలు చేసి, డాటా రూపొందించి 30 రాజకీయ పార్టీలను కలిసి తెలంగాణ ఉద్యమానికి కృషిచేశారని గుర్తు చేశారు. చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర కోసం పోరాటం చేసిన జయశంకర్ సార్ను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరచిపోరని చెప్పారు. తమ అందరితో పరాచికంగా, ప్రేమగా ఉండేవారని భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయాల్లో ఆయనకు ఎన్ని ఆఫర్లు వచ్చినా తిరస్కరించారని అన్నారు. కేసీఆర్ వెనుక ఉండి నడిపించారని పేర్కొన్నారు. కేసీఆర్, జయశంకర్ మధ్య అన్యోన్యమైన అనుబంధం ఉండేదని, ఆ ఇద్దరి మధ్య చర్చోపచర్చలు జరిగేవని చెప్పారు.
ప్రొఫెసర్ జయశంకర్ జీవిత చరిత్రను తెలంగాణ రాష్ట్రంలోని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. మానవతా విలువలు నశించిపోతూ సమాజం భయానక వాతావరణంలో ఉన్న నేపథ్యంలో నేటి తరానికి ప్రొఫెసర్ జయశంకర్ జీవితం, ఉద్యమ నిర్మాణం, నిజాయితీ, ఆయన పాటించిన నైతిక విలువలను బోధించాలని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్, మల్లోజుల విజయ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ తదితరులు ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.