హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంచభూతాలనూ అమ్మకానికి పెడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రజల కష్టార్జితంతో నిర్మించుకున్న ప్రభుత్వరంగ ఆస్తులను ఆమ్మడం ద్వారా రూ. 6 లక్షల 35 వేల కోట్లు సమీకరించాలని తమ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన అత్యంత దుర్మార్గమైనదని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. నిస్సిగ్గుగా ప్రభుత్వ రంగంలోని ఆస్తులను అమ్మకానికి పెడుతూ.. ఆస్తులు ఎక్కడికి పోవని.. తమ చేతుల్లోనే ఉంటాయని.. ప్రైవేటు యాజమాన్యాలకు కేవలం 99 సంవత్సరాలు లీకుజు మాత్రమే ఇస్తున్నామని చెప్పడాన్ని ఆయన తప్పు బట్టారు. ఆ భూములపై ప్రభుత్వానికి ఏమి అధికారం ఉండదని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ కర్మాగారం 20 వేల ఎకరాల్లో ఉందన్నారు. ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేస్తే ఆ భూమి వారికే ఉపయోగపడుతుంది తప్ప ప్రజలు ఉపయోగపడదన్నారు.
ఇలా దేశంలోని రోడ్లు, రైల్వేలు, పోర్టులు, పరిశ్రమలు అన్ని అమ్మేసి దేశాన్ని దివాళా తీయించి, ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేయిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రైవేటు రంగంలోని వ్యక్తుల్లో కూడా తమకు కావాల్సిన ఆదాని, అంబానిలకే అన్నింటినీ దోచి పెట్టాలని కేంద్రం కంకణం కట్టుకుందని వ్యాఖ్యానించారు. ముంబైలోని విమానాశ్రయాన్ని నడుపుతున్నజీవికే సంస్థ యాజమాన్యాన్ని కేంద్రం పెద్దలే బెదిరించి ఆదానీకి దక్కేలా చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని గంగవరం పోర్టు విషయంలోనూ దాన్ని చూస్తున్న కంపెనీని బెదిరించి, భయపెట్టి ఆదానీ వశం చేశారని మండిపడ్డారు.
రూ. 15 లక్షల కోట్ల విలువైన టెలికం రంగాన్ని అత్యంత చవకగా రూ. 30 వేల కోట్లకు అంబానీకి అప్పగించి ప్రభుత్వ రంగాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. దేశ ప్రజల కష్టార్జితాన్ని అప్పనంగా ఇద్దరు కార్పొరేట్లకు అమ్మకానికి పెట్టడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. ఒకపక్క ఇంత దారుణంగా వ్యవహరిస్తూ మరోపక్క మనదేశం-మన సంపద-మన సంప్రదాయం అంటూ ప్రజలను బీజేపీ మోసం చేస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అమ్మకాల వ్యవహారంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నారాయణ పిలుపు నిచ్చారు